పంజాబ్ నుంచి అరవింద్ కేజ్రీవాల్ కొత్త ఇన్నింగ్స్..? ఢిల్లీలో జోరందుకున్న పాలిటిక్స్! ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు సొంత సీటును కోల్పోయిన మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రాజకీయ భవిష్యత్తుపై ఊహాగానాలు జోరందుకున్నాయి. మళ్లీ తన గొంతు వినిపించబోతున్నారా? అసెంబ్లీ నుంచి ఔట్ అయినా, రాజ్యసభలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా? మాజీ సీఎం వేస్తున్న తాజా అడుగులు దేనికి సంకేతం..?
పంజాబ్ నుంచి రాజ్యసభకు అవకాశం
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ, న్యూఢిల్లీ సీటు అరవింద్ కేజ్రీవాల్ ఓటమి తర్వాత, ఇప్పుడు ఆయన రాజకీయ భవిష్యత్తు గురించి చర్చలు జరుగుతున్నాయి. కేజ్రీవాల్ తన కొత్త ఇన్నింగ్స్ను పంజాబ్ నుండి ప్రారంభించవచ్చంటున్నారు. ఆయన పంజాబ్ నుంచి రాజ్యసభకు వెళ్లవచ్చని చెబుతున్నారు. అయితే, ఇప్పటివరకు దీని గురించి అధికారికంగా సమాచారం లేదు.
జోరుగా ప్రచారం
రాజ్యసభకు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ వెళ్లే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. దీనికి సంబంధించి దేశ రాజధానిలో ఊహాగానాలు ఊపందుకున్నాయి. పంజాబ్లోని లుథియానా వెస్ట్ ఉపఎన్నికకు తమ అభ్యర్థిగా రాజ్యసభ ఎంపీ సంజీవ్ అరోరాను ఆమ్ ఆద్మీ ఖరారు చేసింది. సంజీవ్ అరోరా పేరును ఆమ్ఆద్మీ ప్రకటించడంతో కేజ్రీవాల్ తదుపరి ఏం చేస్తారన్న దానిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే గురుప్రీత్ గోగి ఆకస్మిక మరణంతో లూథియానా వెస్ట్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉంది.

పెద్దల సభలో కేజ్రీవాల్..
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్ ఓటమి చెందారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు ఊరికే ఉండరని రాజకీయ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో కేజ్రీవాల్ రాజ్యసభకు వెళతారంటూ బీజేపీ నేతల ఈమధ్య వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో పెద్దల సభలో కేజ్రీవాల్ తన గొంతు వినిపిస్తారని భావిస్తున్నారు. ఇదిలావుంటే, పంజాబ్ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ అంశంపై పంజాబ్ రాజకీయాలు కూడా వేడెక్కాయి.
ప్రజలకు చేసిన అతిపెద్ద ద్రోహం
ఇదిలా ఉండగా, పఠాన్కోట్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే, బిజెపి రాష్ట్ర మాజీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్ను వెనుక ద్వారం ద్వారా పంజాబ్కు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, అందుకే పంజాబ్ నుండి రాజ్యసభకు పంపే చర్చ జరుగుతోందన్నారు. అయితే ఇది పంజాబ్ ప్రజలకు చేసిన అతిపెద్ద ద్రోహం అవుతుందన్నారు. ఢిల్లీ ఎన్నికల్లో ఓడిపోయి ఇప్పుడు రాజకీయాలు, అధికారం కోసం పంజాబ్కు రావాలనుకుంటున్నారన్నారు.
వెనుక ద్వారం ద్వారా అధికారంలోకి ..
అదే సమయంలో, అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ నుండి రాజ్యసభకు వెళ్లే అంశంపై కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఢిల్లీ నాయకులు పంజాబ్ను అధిగమించాలని కోరుకుంటున్నారని అన్నారు. పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు ప్రతాప్ సింగ్ బజ్వా మాట్లాడుతూ, అరవింద్ కేజ్రీవాల్ పంజాబ్ అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని కోరుకుంటున్నారని, తాను ఇంతకు ముందే చెప్పానని, ఇప్పుడు కేజ్రీవాల్ వెనుక ద్వారం ద్వారా పంజాబ్ అధికారంలోకి రావాలనుకుంటున్నట్లు స్పష్టమైందని అన్నారు.