వైసీపీ ఏ కూటమిలో చేరదు: విజయసాయిరెడ్డి

Read Time:  1 min
Vijayasai reddy
Vijayasai reddy
FONT SIZE
GET APP

కేంద్రంలో ఏ కూటమిలో చేరే ఆలోచన తమకు లేదని వైసీపీ నేత విజయ సాయిరెడ్డి తేల్చిచెప్పేశారు. తమది న్యూట్రల్ స్టాండ్ అన్నారు. ఏపీలో గత ఐదేళ్లుగా అధికార పార్టీగా ఉన్నప్పుడు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వానికి సన్నిహితంగా మెలిగిన వైసీపీ తాజా ఎన్నికల తర్వాత మాత్రం దూరంగా ఉంటోంది. దీనికి కారణం ఎన్డీయేలో భాగస్వాములుగా ఉన్న టీడీపీ, జనసేనలే. వీరిద్దరినీ కాదని తమకు మేలు చేసేందుకు ప్రధాని మోడీ సిద్ధం కారన్న అంచనాలతో వైసీపీ ఈ స్టాండ్ తీసుకుంది.

అయితే మధ్యలో రాష్ట్రంలో అధికార టీడీపీ నాయకులు ప్రభుత్వ ఏర్పాటు తర్వాత వైసీపీని టార్గెట్ చేస్తూ దాడులకు దిగినా పట్టించుకోకపోవడంతో ఇండియా కూటమి నాయకులతో కలిసి జగన్ ఢిల్లీలో ధర్నా కూడా చేశారు.

జగన్ ఢిల్లీ ధర్నాలో ఇండియా కూటమిలో భాగస్వామ్య పార్టీలు పాల్గొన్నా కీలకమైన కాంగ్రెస్ పార్టీ మాత్రం దూరంగా ఉండిపోయింది. దీనిపై ఆ తర్వాత జగన్ స్పందించారు కూడా. అయితే ఇప్పుడు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మాత్రం కేంద్రంలో అధికార, విపక్షాలు అయిన ఎన్డీయే, ఇండియా కూటమికి తాము దూరంగా ఉంటామని ప్రకటించారు.

ఇండియా కూటమి, ఎన్డీఏకు మేం సమాన దూరమని వెల్లడించారు.
అయితే ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై మాత్రం తమ పార్టీ అధ్యక్షుడి అభిప్రాయమే చెబుతామన్నారు. ప్రాంతీయ పార్టీగా ఏపీ ప్రయోజనాలే తమకు ముఖ్యమని విజయసాయిరెడ్డి వెల్లడించారు. దీంతో ఇప్పటివరకూ కాంగ్రెస్ పార్టీతో పొత్తు కోసం, ఇండియా కూటమిలో చేరడం కోసం వైసీపీ ప్రయత్నాలు చేస్తోందన్న చర్చకు తెరపడినట్లయింది.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.