రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్ల మందితో మహా యోగా సంబరాలు
జూన్ 21న విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ అంతర్జాతీయ యోగా దినోత్సవానికి కేంద్ర బిందువుగా మారనుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా హాజరుకానుండటంతో ఈ వేడుకలకు ప్రాధాన్యత మరింత పెరిగింది. ఈ వేడుకల్లో కనీసం 5 లక్షల మంది ప్రజలు ప్రత్యక్షంగా పాల్గొనాల్సిందిగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సర్వత్రా సంచలనం సృష్టించేలా, గ్రామ స్థాయిలోనూ ఈ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించేందుకు భారీ ప్రణాళిక సిద్ధం చేసింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ సంబంధిత శాఖల కార్యదర్శులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని, కనీసం 2 కోట్ల మంది ప్రజలు పాల్గొనేలా కలెక్టర్లు కృషి చేయాలని ఆదేశించారు.

యోగాంధ్ర – నెల రోజుల మాసీవ్ ప్రచార కార్యక్రమం ప్రారంభం
ఈ ఏడాది యోగా దినోత్సవం నినాదంగా “Yoga for One Earth, One Health” తీసుకుని రాష్ట్రవ్యాప్తంగా ప్రజల్లో యోగా పట్ల అవగాహన పెంపొందించేందుకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్టు అధికారులు తెలిపారు. జూన్ 21 వరకు ఒక నెలపాటు “యోగాంధ్ర” పేరిట మూడు దశలుగా ఈ ప్రచారం సాగనుంది. ఇందులో మొదటి దశలో (మే 21-27) “Training of Trainers”, రెండో దశ (మే 28-జూన్ 3)లో మండల స్థాయి మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ, చివరి దశలో (జూన్ 4-16) గ్రామ, వార్డు స్థాయిల్లో శిక్షణలు నిర్వహిస్తారు. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మరియు యోగా దినోత్సవ నోడల్ అధికారి ఎం.టి. కృష్ణబాబు ఈ ప్రచార ఏర్పాట్లను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
కర్టెన్ రైజర్, సోషల్ మీడియా ప్రచారంపై ప్రత్యేక దృష్టి
జూన్ 21 వేడుకల ముందు భాగంగా, ఈనెల 21న అన్ని జిల్లాల్లో కనీసం 10 వేల మంది ప్రజాప్రతినిధులు, యోగా శిక్షకులు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్లు, యోగా అభ్యాసకులు తదితరులతో కర్టెన్ రైజర్ ఈవెంట్ నిర్వహించాలని సూచించారు. అంతేకాక, జూన్ 27న ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో సమావేశం నిర్వహించి వారి ద్వారా సామాజిక మాధ్యమాల్లో యోగా ప్రాధాన్యతను ప్రజల్లోకి చాటించాలని సీఎస్ విజయానంద్ పేర్కొన్నారు. సోషల్ మీడియా ద్వారా యువతలో అవగాహన పెంచడం లక్ష్యంగా ప్రత్యేక ప్రచార వ్యూహం రూపొందిస్తున్నారు.
100 పర్యాటక కేంద్రాల్లో యోగా వేడుకలు
జూన్ 21న యోగా దినోత్సవాన్ని కేవలం విశాఖపట్నం లాంటి పెద్ద నగరాల్లో మాత్రమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా 100 పర్యాటక మరియు ఆధ్యాత్మిక కేంద్రాల్లో కూడా ఘనంగా నిర్వహించాలన్నది ప్రభుత్వం లక్ష్యం. యోగా వినూత్న ప్రాముఖ్యతను అందరికీ చేరవేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఇందుకోసం జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖ, పోలీస్ శాఖ సహకారంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంపై సమన్వయపూరితంగా చర్యలు తీసుకోవాలని, మంగళవారం సంబంధిత శాఖలకు సర్క్యులర్లు, జీవోలను జారీ చేస్తామని సీఎస్ విజయానంద్ తెలిపారు. ఈ సమావేశంలో సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేశ్ కుమార్ మీనా, పీఆర్ అండ్ ఆర్డీ శాఖ శశి భూషణ్ కుమార్, ఐ అండ్ ఐ శాఖ డా. ఎన్. యువరాజ్, న్యాయ శాఖ ప్రతిభా దేవి, ఐ అండ్ పీఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్ల తదితరులు పాల్గొన్నారు.
read also: Ration: ఏపీలో రేషన్ పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం