న్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో ఫిర్యాదు దారుని కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలు ఎదుర్కొంటూ అరెస్టు అయిన వల్లభనేని వంశీని ఆయన భార్య పంకజశ్రీ ఇవాళ జైల్లో కలుసుకున్నారు. విజయవాడ సబ్ జైలుకు వెళ్లిన ఆమె.. ములాఖత్ లో భర్త వంశీని కలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సంచలన విషయాలు బయటపెట్టారు. వంశీకి జైల్లో పరిస్దితులపై ఆమె వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
వంశీతో ములాఖత్
విజయవాడ సబ్ జైలులో వంశీతో ములాఖత్ అయిన భార్య పంకజశ్రీ.. ఆయనకు ప్రాణహాని ఉందని ఆరోపించారు. వంశీని అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. వెన్నునొప్పితో వంశీ బాధపడుతున్నారని, తన భర్తను మానసికంగా కుంగదీస్తున్నారన్నారు. వంశీ ఉన్న బారక్ లో 60 సీసీ కెమెరాలు పెట్టారని పంకజ ఆరోపించారు. తన భర్త హెల్త్ బాగుందంటూ వైద్యులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మరో ఆరోపణ కూడా చేశారు. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళ్తామన్నారు.
ఫోన్ లో జగన్ పరామర్శ
కేవలం రూ.20,000కోసం తప్పుడు కేసులు పెట్టి వల్లభనేని వంశీని టార్చర్ పెడుతున్నారన్నారని భార్య పంకజశ్రీ ఆరోపించారు. జగన్ ఫోన్ చేసి పరామర్శించారని, ధైర్యంగా ఉండాలని చెప్పారన్నారు. వచ్చే వారం కలుస్తానని జగన్ చెప్పారన్నారు. మరోవైపు వంశీని అరెస్టు చేసి సబ్ జైల్లో ఉంచాక ఆయన లాయర్లు బెయిల్ కోసం ప్రయత్నిస్తారని భావించినా అలా చేయలేదు. మరోవైపు వంశీని పోలీసు కస్టడీకి తీసుకునేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. ఇప్పటికే ఆయన హైదరాబాద్ నివాసానికి వెళ్లిన పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.