Vijayawada: స్వామి వివేకానంద బోధనలు యువతకు ఆదర్శం: స్వామి స్థితి కంఠానంద

Read Time:  1 min
Swami Sthiti Kanthānanda
Swami Sthiti Kanthānanda
FONT SIZE
GET APP

విజయవాడ : స్వామి వివేకానంద బోధనలను యువత రోల్ మోడల్ గా తీసుకుని, తమ నైపుణ్యాలను, వ్యక్తిత్వాన్ని పెంపెందించుకోవాలని రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద 163వ జయంతిని పురస్కరించుకొని యువజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జాతీయ యువజనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ యువజనోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన రామకృష్ణ మఠం సహాయ కార్యదర్శి స్వామి స్థితి కంఠానంద మాట్లాడుతూ.. వివేకానందుని బోధనలను యువత ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలన్నారు.

Read also: Migratory Birds: ప్రకాశంలో వలస పక్షుల అక్రమ వేట.. స్థానికుల్లో భయాందోళనలు

Swami Sthiti Kanthānanda

Swami Sthiti Kanthānanda

ధ్యానం, సంకల్ప శక్తితో యువత విజయం

నేటి యువత మెడిటేషన్ ను అలవాటుగా చేసుకుని సంకల్ప బలాన్ని పెంపెందించుకోవాలన్నారు. జీవితంలో అతిపెద్ద సవాలు తమ మనస్సును నియంత్రించుకోవడమేనని, మనస్సు అదుపులో ఉంటేనే ఏకాగ్రత పెరుగుతుందని తద్వారా సానుకూల ఆలోచనలు వస్తాయన్నారు. స్వామి వివేకానంద జీవితం, ఆయన చికాగో ప్రసంగం, ఆయన బోధనలు యువతకు గొప్ప స్ఫూర్తినిస్తాయన్నారు. ఆయన రచించిన పుస్తకాలను విద్యార్థులు చదవడం వల్ల మానసిక స్థైర్యం పెరుగుతుందన్నారు. ధృడమైన సంకల్ప శక్తితో ముందుకెళితే యువతకు విజయం సాధ్యపడుతుందని స్వామి స్థితి కంఠానంద తెలియజేశారు.

దేశ భవిష్యత్తులో యువత పాత్ర కీలకం

యువజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎస్వీడీఎస్ రామకృష్ణ మాట్లాడుతూ దేశ భవిష్యత్ యువతపైనే ఆధారపడి ఉందన్నారు. ఢిల్లీలో నిర్వహిస్తున్న జాతీయ యువజనోత్సవాల్లో రాష్ట్రానికి చెందిన 80 మంది పాల్గొనడం శుభ పరిణామమన్నారు. కృష్ణా జిల్లా స్టెప్, కృషి సీఈవో యూ. శ్రీనివాసరావు మాట్లాడుతూ వివేకానందుని జీవితం యువతకు ఆదర్శనీయమని, ఆయన ఆదర్శాలను ఆచరణలో పెట్టి దేశ నిర్మాణంలో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. జాతీయ యువజనోత్సవాల్లో పలు కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారన్నారు.

యువజనోత్సవ పోటీల్లో విజేతలకు సత్కారం

అనంతరం వ్యాస రచన, క్విజ్, డిబేట్ తదితర పోటీల్లో గెలుపొందిన కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలకు చెందిన విజేతలకు ప్రశంసా పత్రాలు, షీల్డ్ లు అందించారు. కార్యక్రమంలో స్కిల్ డెవలప్ మెంట్ అధికారి శ్రీనివాసరావు, యూత్ రెడ్ క్రాస్ కోఆర్డినేటర్ డాక్టర్ హరిప్రసాద్, ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ ప్రభుత్వ కళాశాల ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ కె. రమేష్, జిల్లా విద్యా శాఖ అధికారి మధుభూషణ్, సామాజికవేత్త గోళ్ల నారాయణరావు, చెస్ ఛాంపియన్ ప్రియాంక, వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు, ఎఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు పాల్గొన్నారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read Also:

Rajitha

రచయిత గురించి

Rajitha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.