టీటీడీకి నకిలీ నెయ్యి సరఫరా – సీబీఐ శాంద్ర ఆరోపణలు, బెయిల్పై హైకోర్టులో తీవ్ర వాదనలు
Tirumala Laddu: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) లడ్డూ ప్రసాదం తయారీకి సరఫరా చేసిన నెయ్యి అసలుది కాదని, అది పామాయిల్, రసాయనాలతో తయారుచేసిన నకిలీ నెయ్యి అని సీబీఐ హైకోర్టుకు తెలిపింది.
ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి భోలేబాబా డెయిరీ అని, టీటీడీ బ్లాక్ లిస్టులో ఉన్నందున ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీలను ముందుపెట్టి ఈ దందా నడిపించిందని సీబీఐ తరఫు న్యాయవాది పీఎస్పీ సురేష్కుమార్ గురువారం వాదనలు వినిపించారు.
ఈ కేసుకు సంబంధించి నిందితులు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ జరిగింది.
నెయ్యి తయారీలో అసలు వ్యవస్థే లేదు – రైతులే సాక్ష్యం
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీకి సరఫరా చేసిన నెయ్యిపై సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) విచారణ జరిపిందని సీబీఐ న్యాయవాది కోర్టుకు తెలిపారు.
భోలేబాబా డెయిరీకి పాలు సేకరించి నెయ్యి ఉత్పత్తి చేసే వ్యవస్థే లేదని, ఈ విషయాన్ని రైతులే స్వయంగా చెప్పారని ఆయన పేర్కొన్నారు.
కేవలం పామాయిల్, రసాయనాలు, ఇతర ముడిపదార్థాలతో నకిలీ నెయ్యి తయారు చేసి, ఏఆర్ డెయిరీ, వైష్ణవి డెయిరీల ద్వారా టీటీడీకి సరఫరా చేసినట్లు సిట్ దర్యాప్తులో తేలిందని వివరించారు.
భోలేబాబా డెయిరీని టీటీడీ బ్లాక్లిస్ట్లో పెట్టడంతో, ఈ రెండు డెయిరీలతో ఒప్పందం కుదుర్చుకుని పక్కా ప్రణాళిక ప్రకారమే ఈ మోసానికి పాల్పడినట్లు ఆధారాలున్నాయని తెలిపారు. వాట్సప్ గ్రూప్ చాటింగ్ వివరాలను కూడా సేకరించినట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
సాక్షులపై బెదిరింపులు – బెయిల్కు నిరాకరణ కోరిన సీబీఐ
ఈ కేసులో నిందితులు ఆర్థికంగా, రాజకీయంగా ప్రభావం చూపగలవారని సీబీఐ కోర్టులో స్పష్టంగా తెలియజేసింది.
సాక్షులపై బెదిరింపులకు దిగుతున్నట్లు వాదిస్తూ, సంజీవ్ జైన్ అనే సాక్షి 2025 ఏప్రిల్ 7న తిరుపతికి వచ్చిన సమయంలో నిందితులు దాడి చేసి, చెన్నై మీదుగా బలవంతంగా ఢిల్లీకి పంపారని వెల్లడించారు.
ఇదే సమయంలో మరో నిందితుడు అశిష్ రోహిల్లా నేరాంగీకార వాంగ్మూలం ఇవ్వబోతుండగా, అతని పేరు మీద పిటిషన్ వేసిన ఘటనను కూడా కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
రోహిల్లా స్వయంగా హైకోర్టు రిజిస్ట్రార్కు మెయిల్ ద్వారా ఫిర్యాదు చేశారని వివరించారు.
ఈ పరిస్థితుల్లో నిందితులకు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తు ఆపసోపాలు ఎదుర్కొంటుందని, సాక్షులకు ప్రమాదం తప్పదని తెలిపారు.
నిందితుల వాదనలు – ఆరోగ్యం, సాక్ష్యాలేమీ మాయం చేయలేం
అంతకుముందు, నిందితుల తరఫున సీనియర్ న్యాయవాదులు సీవీ మోహన్రెడ్డి, ఎస్.శ్రీరామ్ వాదనలు వినిపించారు.
తమ క్లయింట్లు గత నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారని, దర్యాప్తు ఇప్పటికే పూర్తయిందని, సిట్ చార్జిషీట్ కూడా దాఖలు చేసిందని తెలిపారు.
కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలు సిట్ వద్ద ఉన్నాయని, నిందితులు అనారోగ్యంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు.
ఏఆర్ డెయిరీ మాత్రమే టీటీడీతో ఒప్పందం చేసుకుందని, భోలేబాబా, వైష్ణవి డెయిరీల డైరెక్టర్లకు ఈ వ్యవహారంతో సంబంధం లేదని వాదించారు.
కోర్టు విధించే ఎలాంటి షరతులకైనా కట్టుబడి ఉంటామని, బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు.
బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించిన వారిలో ఏఆర్ డెయిరీ ఎండీ రాజు రాజశేఖరన్ (నిందితుడు-2), భోలేబాబా ఆర్గానిక్ డెయిరీ డైరెక్టర్లు పొమిల్ జైన్ (నిందితుడు-3), విపిన్ జైన్ (నిందితుడు-4), వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ వినయ్కాంత్ చావడా (నిందితుడు-5) ఉన్నారు.
తదుపరి విచారణ జూన్ 17కు వాయిదా
ఇరుపక్షాల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ టీసీడీ శేఖర్ తదుపరి విచారణను 2025 జూన్ 17వ తేదీకి వాయిదా వేశారు.
నిందితుల తరఫు న్యాయవాదుల అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
Read also: AP DSC: ప్రారంభమైన ఆంధ్ర డీఎస్సీ పరీక్షలు