కడపలో టీడీపీ మహానాడు అట్టహాసం
తెలుగుదేశం పార్టీ నిర్వహించే వార్షిక మహాసభ ‘మహానాడు’ ఈసారి కడపలో అట్టహాసంగా జరిగింది. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు జెండా ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలనతో సభకు శ్రీకారం చుట్టారు. ప్రారంభ సభలో పార్టీకి చెందిన నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. కార్యక్రమంలో మొదటగా ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రసంగించి, పార్టీ భవిష్యత్ దిశగా తీసుకోవలసిన మార్గాన్ని వివరించారు. పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు, పార్టీ కార్యకర్తలకు ఘన నివాళులు అర్పిస్తూ తీర్మానాలు ప్రవేశపెట్టారు.
పార్టీలో పారదర్శకతకు నిదర్శనంగా జమా ఖర్చుల వివరాలు
తెలుగుదేశం పార్టీ జమాఖర్చుల వివరాలను కోశాధికారి పిన్నే పార్థసారథి తెలిపారు. ‘టీడీపీ 2024-2025 వార్షిక ఆర్థిక నివేదిక.. 31-03-2025 నాటికి ముగిసిన సంవత్సరానికి.. టీడీపీ సభ్యత్వ రుసుముల ద్వారా రూ.123 కోట్ల 19 లక్షల ఆదాయం వచ్చింది. పార్టీకి విరాళాలు రూ.82 కోట్ల 5 లక్షలు రాగా.. వడ్డీపై ఆదాయం రూ.23 కోట్ల 5 లక్షలు.. వచ్చిన అద్దె రూ.2లక్షలు.. ఆదాయం మొత్తం కలిపితే రూ.228 కోట్ల 31 లక్షలు వచ్చింది’ అని వివరించారు. అలాగే ఖర్చుల్ని కూడా మహానాడులో వెల్లడించారు.’ ప్రచారం నిమిత్తం ఖర్చు రూ.30 కోట్ల 73 లక్షలు.. ఆఫీస్ అద్దె చెల్లించింది రూ.14 లక్షలు. ఆఫీస్ ఖర్చులు రూ.7కోట్ల 99 లక్షలు.. తరుగుదల రూ.4 కోట్ల 39 లక్షలు.. ఉద్యోగుల జీతాలు రూ.71 లక్షలు కార్యకర్తల సంక్షేమ బీమా రూ.15 కోట్ల 84 లక్షలు.. ఇతర ఖర్చులు రూ.53 లక్షలు.. మొత్తం ఖర్చు 61 కోట్ల 33 లక్షలు. మిగులు రూ.166 కోట్ల 98 లక్షలు కాగా.. వార్షిక సంవత్సరంకు సంబంధించిన సంక్షేమ బీమా చెల్లింపునకు రూ. 48 కోట్ల 9 లక్షలు చెల్లించారు. 2025 మార్చి నాటికి రూ.126 కోట్ల 98 లక్షలతో లెక్కలు ముగించాము’ అని వివరించారు.
కోటిమంది కార్యకర్తలకు ప్రమాద బీమా
పార్టీ చరిత్రలోనే గణనీయమైన ముందడుగు ఈసారి తీసుకున్న టీడీపీ, కార్యకర్తల సంక్షేమం కోసం భద్రత కల్పించేందుకు భారీ నిర్ణయం తీసుకుంది. యువనేత నారా లోకేష్ చొరవతో యునైటెడ్ ఇండియా (United India Insurance) ఇన్స్యూరెన్స్, ప్రాగ్మ్యాటిక్ ఇన్స్యూరెన్స్ బ్రోకింగ్ (Pragmatic Insurance Broking) సంస్థలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం పార్టీ సభ్యత్వం తీసుకున్న దాదాపు కోటి మంది కార్యకర్తలకు రూ.5 లక్షల ప్రమాద బీమా అందుబాటులోకి వచ్చింది. ఈ బీమా పథకం 2025 జనవరి 1 నుండి డిసెంబర్ 31 వరకు అమలులో ఉంటుంది. దీని కోసం పార్టీ రూ.48 కోట్లు ప్రీమియంగా చెల్లించింది. ఇదే తీరులో వచ్చే ఏడాది కూడా ప్రీమియం మొత్తాన్ని టీడీపీ భరిస్తుందని అధికారికంగా వెల్లడించారు. ఇది దేశ రాజకీయాల్లోనే తొలిసారిగా ఏకకాలంలో కోటిమందికి బీమా అందించిన ఘటనగా చరిత్రకెక్కింది.
కార్యకర్తల సంక్షేమమే లక్ష్యం
నారా లోకేష్ బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీ కేడర్ (Party cadre) సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. టీడీపీ హైదరాబాద్తోపాటు కృష్ణాజిల్లా చల్లిపల్లిలో ఎన్టీఆర్ ట్రస్ట్ తరపున రెసిడెన్షియల్ స్కూళ్లు ఏర్పాటు చేసి ఉచితంగా విద్యనందిస్తున్నారు. ఈ స్కూళ్లలో పార్టీ కార్యకర్తల పిల్లలకు ఉచిత విద్య, వసతి అందిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ అవసరాల కోసమే కాకుండా, భవిష్యత్తు యువత స్ధిరత కోసం తీసుకున్న మార్గదర్శక చర్యగా చూడవచ్చు.
Read also: Mahanadu: మహానాడులో నోరూరించే వంటకాలు