తిరుమల : కలియుగవైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజులు నిర్వహించే పవిత్రోత్సవాలు (Holy festivals) మంగళవారం ఉదయం శాస్త్రోక్తంగా ఆరంభమయ్యాయి. వైష్ణవ సాంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి సమయాల్లో తెలిసీతెలియకో భక్తులు, ఆలయ సిబ్బందిచేత కలిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎటువంటి భంగం వాటిల్లకుండా జరిపించే ఈ పవిత్రోత్సవాలు మంగళవారం నుండి మొదలయ్యాయి. వైఖానస ఆగమోక్తంగా జరిపించే ఈ ఉత్సవాల్లో తొలిరోజు ఉదయం శ్రీదేవి భూదేవిసమేత మలయప్పస్వామివారిని సంపంగిప్రాకారంలోని పవిత్రమండపంలోనికి వేంచేపుచేశారు. అక్కడ హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. వేడుకగా ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరిజలం సుగందద్రవ్యాలతో అభిషేకించారు. వేదపండితులు వేదసూక్తాలను పఠించారు. సాయంత్రం ఉత్సవమూర్తులు స్వామిఅమ్మవార్లు ఆలయ నాలుగుమాఢవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో స్వామివారికి జరిగే ఆర్జితసేవలు రద్దుయ్యాయి. పవిత్రోత్సవాల్లో తొలిరోజు మధ్యాహ్నం శ్రీదేవిభూదేవిసమేత మలయప్పస్వామికి పవిత్ర ప్రతిష్ట చేపట్టారు. ఈ సందర్భంగా అష్టదళపాదపద్మారాథన, కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జితబ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకారసేవలు రద్దయ్యాయి. ఈ కార్యక్రమంలో పెద్దజీయ్యంగారు, చిన్నజీయ్యంగారు. టిటిడి (TTD) అదనపు ఇఒచిరుమామిళ్ళ వెంకయ్య చౌదరి దంపతులు, ఆలయ డిప్యూటీ ఇఒ లోకనాథం, ఆలయ ప్రధానఅర్చకుడు వేణుగోపాలదీక్షితులు, అర్చకులు పాల్గొన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :