Politics : ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేయడంలో విఫలమయ్యారని తీవ్ర విమర్శలు గుప్పించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హామీని కూడా సరిగా అమలు చేయలేదని, ఈ చిన్న హామీని కూడా ఆంక్షలతో, పరిమిత బస్సులకు మాత్రమే అమలు చేస్తూ మహిళలకు “వెన్నుపోటు” పొడిచారని ఆరోపించారు. రాష్ట్రంలోని 11,256 ఆర్టీసీ బస్సుల్లో కేవలం 6,700 బస్సుల్లోనే ఉచిత ప్రయాణం అందుబాటులో ఉందని, అందులోనూ 950 నాన్-స్టాప్ ఎక్స్ప్రెస్ బస్సులకు ఈ పథకం వర్తించదని జగన్ గుర్తు చేశారు. ఈ ఆంక్షలు మహిళలకు చేసిన “మోసం, దగా” అని నిలదీశారు.
గత హామీల ఎగవేత, ప్రచార విడ్డూరం
జగన్ మాట్లాడుతూ, చంద్రబాబు 2014-19 మధ్య డ్వాక్రా రుణాల మాఫీ హామీతో మహిళలను మోసం చేసి, వడ్డీని కూడా ఎగవేశారని, ఇప్పుడు మళ్లీ సూపర్ సిక్స్ హామీలతో అదే తరహా మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఉచిత బస్సు ప్రయాణం, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాలను ప్రచార హడావుడిగా మాత్రమే ఉపయోగిస్తున్నారని, బస్సు ఎక్కితే మహిళలు లక్షాధికారులవుతారని చంద్రబాబు చేస్తున్న ప్రకటనలు విడ్డూరంగా ఉన్నాయని విమర్శించారు. గ్యాస్ సిలిండర్ పథకంలో గత ఏడాది మూడు సిలిండర్లకు బదులు ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారని, 1.59 కోట్ల కనెక్షన్లకు రూ.4,100 కోట్లు కేటాయించాల్సి ఉండగా, కేవలం రూ.764 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని, ఈ ఏడాది కూడా రూ.747 కోట్లతో పరిమితమైన అమలు చేశారని జగన్ ఆరోపించారు.

వైఎస్సార్సీపీ హయాంలో మహిళా సాధికారత
వైఎస్సార్సీపీ హయాంలో మహిళా సాధికారత కోసం అనేక పథకాలను సమర్థవంతంగా అమలు చేశామని జగన్ పేర్కొన్నారు. అమ్మ ఒడి పథకంలో 87 లక్షల మంది పిల్లలకు రూ.30 వేలు ఇవ్వాల్సి ఉండగా, చంద్రబాబు 30 లక్షల మందికి కోత విధించి, కేవలం రూ.13 వేలు మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ఆసరా ద్వారా రూ.25,571 కోట్లు, సున్నా వడ్డీ కింద రూ.5,000 కోట్లు, చేయూత ద్వారా 33.14 లక్షల మందికి రూ.19,189 కోట్లు, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం ద్వారా రూ.3,905 కోట్లు నేరుగా మహిళలకు అందించామని, 31 లక్షల ఇళ్ల పట్టాలను మహిళల పేరిట రిజిస్టర్ చేశామని జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు ఈ పథకాలను రద్దు చేసి, మహిళలను పేదరికంలోకి నెట్టారని, “బాబు ష్యూరిటీ… మోసం గ్యారెంటీ” అని వైకాపా నిర్వహిస్తున్న కార్యక్రమం ద్వారా ఈ మోసాలను ప్రజలకు తెలియజేస్తామని జగన్ పేర్కొన్నారు.
READ HINDI NEWS : hindi.vaartha.com
READ ALSO :