బాలింతలకు నూతన ఆశ – ప్రభుత్వ ఆసుపత్రుల్లో పునఃప్రారంభం
ఆంధ్రప్రదేశ్లో ప్రజల ఆరోగ్య సంరక్షణను పురోగమింపజేసే దిశగా నూతన కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో బిడ్డలను ప్రసవించే మహిళల ఆరోగ్యం, శిశువుల రక్షణ కోసం గతంలో అమలు చేసిన ఎన్టీఆర్ బేబీ కిట్ పథకాన్ని మళ్లీ ప్రారంభించేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పథకం వచ్చే నెల నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అమల్లోకి రానుందని సమాచారం. ప్రత్యేకించి పీహెచ్సీలు, యూపీహెచ్సీలు, సీహెచ్సీలు, జిల్లా ఆసుపత్రుల్లో ఈ పథకం అందుబాటులో ఉండనుంది. ఇది ప్రభుత్వాసుపత్రుల్లో కాన్పుల సంఖ్యను పెంచే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఈ పథకం ద్వారా ఆసుపత్రుల్లో ప్రసవించిన బాలింతలకు బేబీ కిట్లు అందించడం జరుగుతుంది. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో ఇది కీలకంగా నిలుస్తుంది. టీడీపీ ప్రభుత్వం 2016 జులైలో ఎన్టీఆర్ బేబీ కిట్ల పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించింది. అయితే, 2019లో వైసీపీ సర్కారు ఈ పథకం పేరును డాక్టర్ వైఎస్ఆర్ బేబీ కిట్లుగా మార్చింది. ఏడాది పాటు ఇచ్చి ఆ తర్వాత ఆపేసింది. దాదాపు నాలుగేళ్లుగా ఈ పథకం నిలిచిపోవడంతో ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు చేసుకున్న లక్షలాది మంది మహిళలు లబ్ది పొందలేకపోయారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెంచాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మళ్లీ మొదలుపెడుతున్నారు. దీంతో సర్వాత్ర హర్షం వ్యక్తం అవుతోంది.
ఎన్టీఆర్ బేబీ కిట్లో ఏముంటుంది?
ఇక, రూ. 1410 విలువ చేసే ఎన్టీఆర్ బేబీ కిట్లో 11 రకాల వస్తువులు ఉంటాయి. చిన్నారికి దోమతెరతో కూడిన బెడ్, బేబీ డ్రస్, బేబీ సబ్బు, పౌడర్, బేబీ ఆయిల్, బొమ్మ, న్యాప్కిన్, టవల్స్, వాటర్ ప్రూఫ్ కాట్ షీట్, బేబీ షాంపూ, తల్లి చేతులు శుభ్రం చేసుకోవడానికి ద్రావణం ఉంటాయి. వీటి విలువ రూ. 1410గా ప్రభుత్వం నిర్ణయించిందని అధికారులు చెప్పారు. ఈ పథకం వల్ల ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు పెరుగుతాయని సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి అన్నారు.
పథకం పునఃప్రారంభంపై హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు
ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సేవలు అందుతున్నాయన్న నమ్మకంతో గర్భిణులు ఆసుపత్రులకు వచ్చే అవకాశం పెరుగుతుంది. పథకాన్ని నిలిపివేయడం వల్ల గతంలో లబ్ది పొందలేకపోయిన లక్షలాది మహిళలు ఇప్పుడు ఉపశమనం పొందే అవకాశముందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పేద కుటుంబాలకు ఇది ఎంతో మేలు చేస్తుందన్నది వారి అభిప్రాయం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం పెరగడమే కాక, తల్లి-శిశు మరణాలు తగ్గేందుకు ఈ బేబీ కిట్లు సహాయపడతాయని సూపరింటెండెంట్ శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
Read also: Ration Card : ఏపీలో వాట్సాప్లో రేషన్ కార్డు సేవలు వచ్చేశాయ్