పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులపై జరిగిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన వీరజవాన్ ఎం. మురళీనాయక్ పార్థివదేహాన్ని ఆయన స్వగ్రామమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలో ఉన్న కళ్లితండాకు శనివారం రాత్రి తరలించారు. దేశ రక్షణ కోసం తన ప్రాణాన్ని అర్పించిన మురళీనాయక్ వీరమరణం దేశవ్యాప్తంగా దుఃఖాన్ని కలిగించింది.

ఢిల్లీ నుండి కళ్లితండా వరకు
మురళీనాయక్ పార్థివ దేహాన్ని ఢిల్లీ నుంచి ఇండిగో విమానంలో మొదట బెంగళూరు విమానాశ్రయానికి తీసుకువచ్చారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా శనివారం రాత్రి శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలంలోని కళ్లితండాకు తరలించారు. అక్కడ మధ్యాహ్నం 2 గంటలకు ర్యాలీగా రోడ్డు మార్గంలో తరలింపు ప్రారంభమైంది. రాత్రి 9:30 గంటల వరకు సాగిన ఈ ర్యాలీ మార్గమంతా ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమరవీరుడికి శ్రద్ధాంజలి ఘటించారు. గ్రామానికి చేరుకున్న మురళీనాయక్ పార్థివదేహాన్ని సైనికాధికారులు ఆయన తల్లిదండ్రులు శ్రీరామనాయక్, జ్యోతిబాయిలకు అధికారికంగా అప్పగించారు.
అంతిమయాత్రలో పాల్గొననున్న రాష్ట్ర మంత్రులు
మురళీనాయక్కు ఈరోజు అధికారిక, సైనిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ అంత్యక్రియలకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్ తదితరులు హాజరై నివాళులర్పించనున్నారు. మురళీనాయక్ అంత్యక్రియలకు ప్రముఖులు కళ్లితండాకు విచ్చేయనుండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
Read also: Murali Nayak : మురళీ కుటుంబాన్ని ఓదార్చిన సింగర్ మంగ్లీ