సంక్షేమ పథకాల అమలుపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు పథకాల అమలుకు ఒక క్యాలెండర్ను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. క్యాలెండర్ ప్రకారం పథకాలను క్రమం తప్పకుండా అమలు చేయాలని జూన్లో పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం పథకాన్ని అమలు చేస్తామన్నారు. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తామని ఈ పథకాలకు ఎంత ఖర్చవుతుందో నివేదిక ఇవ్వాలని కేబినెట్ సమావేశంలో అధికారులను ఆదేశించారు. ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామో చెబితే ప్రజల్లో ప్రభుత్వంపై నమ్మకం పెరుగుతుందని వార్షిక క్యాలెండర్(Annual calendar)ను వీలైనంత త్వరగా విడుదల చేయాలని చంద్రబాబు ఆదేశించారు.రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ‘తల్లికి వందనం’ కింద ఒకే విడతలో తల్లుల ఖాతాలో డబ్బులు జమ చేస్తామని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆర్థిక పరిస్థితి బాగాలేనందున ఒకేసారి రూ.10 వేల కోట్లు ఇవ్వడం కష్టం అవుతుందని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. తల్లికి వందనం కింద ఇచ్చే డబ్బును రెండు విడతలుగా ఇస్తే బాగుంటుందని సూచించారు. చంద్రబాబు మాత్రం ఈ విషయంలో మరో ఆలోచనకు తావు లేదని తేల్చి చెప్పారు. తల్లికి వందనం డబ్బుల్ని ఒకే విడతలో జమ చేయాలన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా పాఠశాలలు తెరిచేలోగా డబ్బులు ఇవ్వాలని ఆదేశించారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి మంత్రులు కొత్తగా ఆలోచించాలని సూచించారు. పింఛన్లు పంపిణీ చేసేటప్పుడు, మత్స్యకారులకు డబ్బులు ఇచ్చేటప్పుడు తాను లబ్ధిదారులతో మాట్లాడానని అలాగే మంత్రులు కూడా ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
ప్రభుత్వం
సూపర్ సిక్స్లో భాగంగా ఇప్పటికే మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామని చంద్రబాబు గుర్తు చేశారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి డబ్బులు వారి ఖాతాల్లో పడ్డాయో లేదో ఎంతమంది మంత్రులు తెలుసుకున్నారని ప్రశ్నించారు. మంత్రులు సమాధానం చెప్పకపోవడంతో అసహనం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి వారికి డబ్బులు అందిందీ లేనిదీ తెలుసుకుని వారు ఉచితంగా అందుకున్న సిలిండర్పై టీ పెట్టించుకుని తాగి రావాలి అని కూడా సూచించారు. మిగిలిన పథకాల విషయంలోనూ కొత్తగా ఆలోచించి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఏపీ ప్రభుత్వం తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకాలను అమలు చేసేందుకు సిద్ధమైంది ఈ మేరకు ఆ ప్రక్రియ కొనసాగుతోంది.గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై మంత్రులెవరూ బయట మాట్లాడవద్దని, మీడియా ప్రతినిధులు అడిగినా స్పందించవద్దని ముఖ్యమంత్రి సూచించారు. సిట్ దర్యాప్తు(SIT investigation) జరుగుతున్నందున మాట్లాడొద్దని చెప్పారు. మద్యం కుంభకోణం విషయంలో తప్పు చేసినవాళ్లు ఎంతటివారైనా వదిలే ప్రసక్తి లేదన్నారు. దర్యాప్తు జరుగుతున్నప్పుడు మంత్రులు స్పందిస్తే దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారన్న భావన కలిగే అవకాశం ఉంది అని వ్యాఖ్యానించారు.
Read Also: Andhra Pradseh: పోలీసులు తప్పు చేస్తే కోర్టుధిక్కరణ కేసు నమోదు చేస్తాం:హైకోర్టు