Maha Lodda Waterfalls: సహజసిద్ధమైన సౌందర్యాలకు కేరాఫ్ అడ్రస్ మన్యం ప్రాంతమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు. జలపాతాల ఖిల్లా మన్యం జిల్లా అని కితాబిచ్చారు. జిల్లాలో అనేక సహజ సౌందర్యాలు ఉన్నాయని, మరో ఆంధ్రా ఊటీలా జిల్లాను తీర్చిదిద్దడమే తమ ముందున్న ప్రధాన లక్ష్యమని అన్నారు. సాలూరు మండలం, కొదమ గిరిజన పంచాయతీ పరిధిలోని ప్రకృతి రమణీయమైన మహా లొద్ద జలపాతాన్ని మంత్రి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చిన ఇన్నేళ్ల తర్వాత, తొలిసారిగా లొద్ద జలపాతానికి శాశ్వత రహదారి సౌకర్యాన్ని కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని తెలిపారు.
Read Also: Himanshu Shukla: GST వసూళ్లపై కలెక్టర్ సమీక్ష
రవాణా సౌకర్యాలు మరియు ఉపాధి(Maha Lodda Waterfalls)
గిరిజన ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. మహా లొద్ద జలపాతానికి చేరుకునేందుకు వీలుగా 6 కిలోమీటర్ల మేర రహదారిని సుమారు రూ. 6 కోట్ల వ్యయంతో నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఈ రోడ్డు మార్గం పూర్తయితే పర్యాటకుల తాకిడి పెరిగి, స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రకృతికి ఆలవాలమైన ఈ జలపాతం నుంచి అందాలను వీక్షించేలా పెద్ద గెస్ట్ హౌస్ ను నిర్మించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. డోలీ మోతలు లేని జిల్లాగా చేయాలని అన్ని రోడ్లను మంజూరు చేస్తున్నామని, సిరివరకు రూ. 14 కోట్లతో మరొక రోడ్డును మంజూరు చేశామని చెప్పారు.
పర్యాటక అభివృద్ధి ప్రణాళికలు
జిల్లా కలెక్టర్ వినూత్న ఆలోచనలు చేస్తున్నారని, ముస్తాబు, రెవిన్యూ క్లినిక్, జలపాతాలను ప్రారంభించుకోవడం జరిగిందని మంత్రి తెలిపారు. ఈ జలపాతం వద్ద పిల్లలు ఆనందంగా గడపాలని, ట్రెక్కింగ్ కూడా చేయవచ్చని అన్నారు. ఈ ప్రాంతానికి వచ్చే పర్యాటకుల కోసం గైడ్ లను, ట్రెక్కింగ్ కొరకు బోయ్స్ ఉన్నారని, వారితో చుట్టుప్రక్కల అందాలను తిలకించవచ్చని అన్నారు. తమ నియోజకవర్గంలో మూడు నీటి ప్రాజెక్టులు ఉన్నాయని, వాటిని కూడా పర్యాటక కేంద్రాలుగా మార్చి, బోట్ షికారు ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నట్లు తెలిపారు.
కలెక్టర్ సందేశం మరియు అధికారుల హాజరు
జిల్లా కలెక్టర్ డా. ఎన్.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధికి కృషిచేయాలని, విద్య, వైద్య రంగాలపై ప్రత్యేక దృష్టి సారించాలని ముఖ్యమంత్రి సూచించారన్నారు. మంత్రి ఆధ్వర్యంలో ఈ రోజు ఏడవ జలపాతాన్ని ప్రారంభించుకున్నామని, గత మూడు నెలల్లో ఏడు జలపాతాలను అందుబాటులోకి తెచ్చామని తెలిపారు. ఈ పర్యటనలో సబ్ కలెక్టర్లు ఆర్.వైశాలి, పవార్ స్వప్నిల్ జగన్నాథ్, జిల్లా అటవీ శాఖాధికారి జిఏపీ ప్రసూన, జిల్లా పశు సంవర్ధక శాఖాధికారి డా. ఎస్.మన్మధరావు, అటవీ రేంజ్ అధికారులు, ఇతర అధికారులు, ప్రజా సంఘాలు, గిరిజనులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: