కన్యాశుల్కం రీతిలో పెళ్లి కుమారుని నుండి డబ్బు వసూలు
విజయవాడ: కర్నాటక(Karnataka)కు చెందిన ఓ పెళ్ళి కుమారుడిని కృష్ణలంక(Krishnalanka)కు చెందిన ఆమని అనే యువతితో పాటు కొంత మంది బ్రోకర్లు కలిసి కన్యాశుల్కం రీతిలో పెండ్లి కుమారుని నుండి డబ్బులు వసూలు చేసి ఆనక పరారైన ఉదంతంపై ఫిర్యాదు మేరకు పోలీసులు(Police) కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక లోని కొప్పల్ జిల్లా, కొరటాయి మండలం, జేవీ క్యాంపు గ్రామానికి చెందిన కాంట్రాక్టరు వద్ద గుమాస్తాగా పనిచేస్తున్న కర్నాటకలో స్థిరపడ్డ గున్నం దుర్గాప్రసాద్, 34 సంవత్సరాలు నిండినా వివాహం కాకపోవడంతో తాను ఉంటున్న ప్రాంతానికి చెందిన శ్రీదేవిని ఆశ్రయించాడు. ఆమె తనకు తెలిసిన రాజమండ్రికి చెందిన తాయారు అనే పెళ్ళిళ్ళ బ్రోకరును ఆశ్రయించింది. ఆమె తనకు తెలిసిన విజయవాడకు చెందిన పార్వతి, మెరాగ్ అనే వారి ద్వారా విజయవాడ కృష్ణలంక లోని ఒక హోటల్ పక్క రోడ్డులో యువతి బంధువుల ఇంటి వద్ద పెళ్ళిచూపుల తతంగాన్ని నడిపించారు. ఈ నేపథ్యంలో పెండ్లి కుమార్తె ఆమని బంధువుల ఇంటిలో పెండ్లి చూపులు చూపించారు. పెండ్లి కుమారుడైన గున్నం దుర్గాప్రసాద్ వివాహం నిమిత్తం పెండ్లికుమార్తె పల్లవికి రూ. 2లక్షల70వేలు ఎదురు కట్నం ఇచ్చేలాగున ఒప్పందం కుదుర్చుకున్నారు.
ఐదు రోజులు పెళ్ళికుమార్తెగా నటిస్తే రూ.50వేలు
అయితే వారి నుండి ఖర్చులకని పెండ్లికుమార్తె తరపు వారికి రూ.18వేలు ఇచ్చారు. బ్రోకరుగా వ్యవహరించిన పార్వతికి రూ.50వేలు ఇచ్చారు. మరో బ్రోకరు రాజమండ్రికి చెందిన తాయారుకు రూ. 20వేలు ఇచ్చారు. పెండ్లి కుమార్తె బట్టలకని ఆమె స్నేహితురాలికి రూ.18వేలు ఇచ్చారు. మిగిలిన సొమ్మును కర్నాటకలో తమ ఊరిలో ఉంటున్న శ్రీదేవికి ఇచ్చారు. గత నెల 13న విజయవాడలో పెండ్లి చూపుల తతంగం కూడ జరిపించారు. వివాహ తతంగంలో కొంత భాగాన్ని నిర్వహించారు. అమ్మాయి వరునికి నచ్చడంతో ఇక మోసానికి తెరలేపారు. ఈ నెల 5న ఇంద్రకీలాద్రిపై వివాహం తంతు పెండ్లికుమార్తె అయిన ఆమనితో జరిపించారు. అనంతరం వారందరూ కర్నాటకకు చేరుకున్నారు. 7వ తేదీన కర్నాటక లోని పెండ్లికుమారుని స్వగృహంలో రిసెప్షన్ కూడ ఘనంగా నిర్వహించారు. మూడు నిద్రల అనంతరం పెండ్లికుమారుని ఇంట్లో ఆమని తన భర్తతో కాపురం చేసేందుకు నిరాకరించడంతో భర్త, అతని కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. దాంతో ఆమెను నిలదీయడంతో షాకింగ్ విషయం బయటకు వచ్చింది. తనకు అప్పటికే వివాహం అయ్యిందని, తనకు ఒక పిల్లవాడు కూడ ఉన్నాడని, తనను భర్త వదిలేయడంతో పిల్లలతో కలిసి జీవిస్తున్నానని, ఐదు రోజులు పెళ్ళికుమార్తెగా నటిస్తే రూ.50వేలు ఇస్తామని ఆశ చూపి, తనకు కొంత సొమ్ము మాత్రమే ఇచ్చారని, తాయారు, పార్వతి, విమల, తదితరుల బ్రోకర్ల మాటలు విని ఈ వివాహం చేసుకున్నానని తెలిపింది. దాంతో మధ్యవర్తులు వివాహం అయిన శ్రీదేవి, పార్వతి, మెరాగ్ తదితరులు వివాహమైన మహిళను వివాహం గాని మహిళగా నమ్మించి సుమారు రూ. 4లక్షలు తన వద్ద వసూలు చేసి, వివాహం చేసి మోసం చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు వివాహం జరిపించిన బ్రోకర్లపై ఛీటింగ్, తదితర సెక్షన్ల క్రింద పోలీసులు కేసు నమోదు చేశారు.