ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడలో వందేభారత్ రైళ్లకు సంబంధించిన డిపో ఏర్పాటు చేస్తుండగా ఆ పనులు చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ డిపో ప్రారంభించేందేకు సిద్ధమవుతున్నారు. విజయవాడలో వందేభారత్ రైళ్లకు(Vande Bharat train) ప్రత్యేకంగా మెయింటెనెన్స్ డిపోను ఏర్పాటు చేస్తున్నారు. ఇది మిల్క్ ఫ్యాక్టరీ దగ్గర, ఫ్లై ఓవర్ పక్కన రైల్వే యార్డుకు దగ్గరగా ఉంది. ఇక్కడ మెట్రో రైళ్లు రావడానికి కూడా ట్రాక్లను సిద్ధం చేశారు. మెకానిక్లు నడవడానికి వీలుగా ట్రాక్స్ వెంబడి కాంక్రీట్ స్లాబ్స్(Concrete slabs) వేశారు. ప్రస్తుతం విజయవాడ – చెన్నై వందేభారత్ రైలుకు విజయవాడలోనే మెయింటెనెన్స్ చేస్తున్నారు. కోచింగ్ డిపోలో ఈ పనులు జరుగుతున్నాయి. డిపో అందుబాటులోకి వచ్చాక, వందేభారత్ రైళ్లకు ఇక్కడే ప్రత్యేకంగా మెయింటెన్ చేస్తారు. మెయింటెనెన్స్ చార్ట్ ప్రకారం రైలును ప్రయాణానికి సిద్ధం చేస్తారు. ఏవైనా రిపేర్లు ఉంటే ఇక్కడే చేస్తారు.

ఉద్యోగులు
వందేభారత్ మెయింటెనెన్స్ కోసం పక్కనే ఒక పరిపాలనా భవనాన్ని కూడా నిర్మించారు. ఇక్కడ అధికారులు, ఉద్యోగులు పనిచేస్తారు. నీటి సరఫరా కోసం ఓవర్ హెడ్ ట్యాంక్ ను ఏర్పాటు చేశారు. చెన్నైలోని ఇంటిగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీ (ICF) లో వందేభారత్ రైళ్లను తయారు చేస్తున్నారు. దీనివల్ల భవిష్యత్తులో మరిన్ని వందేభారత్ రైళ్లు విజయవాడ మీదుగా నడిచే అవకాశం ఉంది.వాస్తవానికి విజయవాడ మీదుగా ప్రస్తుతం మూడు వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. సికింద్రాబాద్ – విశాఖపట్నం, విజయవాడ – చెన్నై, తిరుపతి – విజయవాడ మధ్య ఈ రైళ్లు తిరుగుతున్నాయి. దేశంలోనే ఇది రెండో అతిపెద్ద రైల్వే జంక్షన్ కావడంతో ఇక్కడ మెయింటెనెన్స్ స్టేషన్ అవసరం అని భావించారు. అందుకే ఈ డిపోను ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు.
Read Also: Telugu Desam Party : జర్మనీలో మినీ మహానాడు పోస్టర్ ఆవిష్కరించిన నేతలు