Tirumala: మరోసారి తిరుమలలో చిరుత కలకలం

Read Time:  1 min
Tirumala: మరోసారి తిరుమలలో చిరుత కలకలం
FONT SIZE
GET APP

ఇటీవల కాలంలో తిరుమల ఘాట్‌ రోడ్లలో చిరుత సంచారం కనిపిస్తోంది. ఇప్పుడు వేసవి కాలం కావడంతో అడవి జంతువులు ఇలా వస్తున్నాయి.తిరుమల రెండో ఘాట్‌రోడ్డులోని వినాయకస్వామి ఆలయ సమీపంలో తాజాగా చిరుత సంచారం కలకలం రేపింది.ఆలయ సమీపంలో సోమవారం చిరుత రోడ్డు దాటుతున్న సమయంలో వాహనదారుల కంటపడింది. వెంటనే వారు అప్రమత్తమై టీటీడీ(TTD) అలిపిరి భద్రతా సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పరిసరాలను పరిశీలిస్తున్నారు. తిరుమలలో రెండు, మూడు నెలల క్రితం కూడా చిరుతల సంచారం కనిపించింది. తిరుమలతో పాటుగా తిరుపతిలో కూడా చిరుతలు(Cheetahs) సంచరించాయి. ఆ సమయంలో టీటీడీ అలర్ట్ అయ్యింది, తిరుమలకు నడకమార్గాల్లో వెళ్లే భక్తుల్ని గుంపులు, గుంపులుగా కొండపైకి వెళ్లాలని సూచించింది. మళ్లీ తాజాగా ఘాట్ రోడ్డులో చిరుత సంచారం కలకలం రేపింది. దీంతో వాహనదారులు ఘాట్ రోడ్డులో అలర్ట్‌గా వెళ్లాలని టీటీడీ, అటవీశాఖ అధికారులు సూచిస్తున్నారు. అలాగే నడక మార్గాల్లో వెళ్లే భక్తులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి అంటున్నారు అధికారులు.

 Tirumala: మరోసారి తిరుమలలో చిరుత కలకలం
మరోసారి తిరుమలలో చిరుత కలకలం

ఆస్థానం

ఇక మరోవైపు తిరుపతిలో ఉత్సవాలు విశేషంగా కొనసాగుతున్నాయి.వైశాఖ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీ గోవిందరాజస్వామివారి పొన్నకాల్వ ఉత్సవం సోమవారం వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం 6 గంటలకు ఆలయం నుండి శ్రీదేవి, భూదేవి సమేత గోవిందరాజస్వామి, ఆండాల్‌ అమ్మవారు, శ్రీకృష్ణస్వామి, విష్వక్సేనులవారు తొమ్మిది మంది దేవేరులతో ఊరేగింపుగా తనపల్లి రోడ్డులో గల పొన్నకాల్వ మండపానికి ఊరేగింపు చేరుకున్నారు. అనంతరం అక్కడ ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్వామి, అమ్మవార్లకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్ళతో స్వామి, అమ్మవార్ల ఉత్సవర్లకు అభిషేకం చేశారు. అనంతరం సేవాకాలం, శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు ఊంజలసేవ, ఆస్థానం చేపట్టారు. ఆ తరువాత సాయంత్రం 5 గంటలకు శ్రీగోవిందరాజస్వామివారు అక్కడినుండి బయలుదేరి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. గోవిందరాజస్వామివారు వచ్చే సమయంలో అమ్మవారి ఆలయంలో ఒక తలుపు మూసి ఉంచుతారు. బావగారైన గోవిందరాజస్వామివారు వచ్చారని పద్మావతి అమ్మవారు లోపలి నుండి ఆసక్తిగా తొంగి చూస్తారని, అందుకే ఆలయం ఒక తలుపు మూసి ఉంచుతారని పురాణాల ద్వారా తెలుస్తోంది. గోవిందరాజస్వామివారు ఊరేగింపుగా ఆలయానికి బయలుదేరారు. రాత్రి 9.30 గంటలకు తిరిగి శ్రీ గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకోవడంతో పొన్నకాల్వ ఉత్సవం ముగుస్తుంది. ఈ కార్యక్రమంలో శ్రీ శ్రీ శ్రీ పెద్ద జీయర్, శ్రీ శ్రీ శ్రీ చిన్న జీయంగార్లు, ఆలయ డిప్యూటీ ఈవో వి.ఆర్. శాంతి, ఏఈఓ ముని కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్లు ఎ.వి.శేషగిరి, చిరంజీవి, ఆలయ ఇన్స్పెక్టర్‌లు యు.ధనుంజయ, రాధాకృష్ణ ఇతర అధికారులు, ఆలయ అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

Read Also : AP Cabinet : ఈనెల 20న ఏపీ క్యాబినెట్ భేటీ

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.