బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)తీర ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులు ఆందోళన కలిగిస్తున్నాయి. వాయవ్య బంగాళాఖాతంలో, ఉత్తరాంధ్ర మరియు దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంగా ఈ అల్పపీడనం కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. అల్పపీడనానికి తోడు ద్రోణి కొనసాగుతుండటంతో పరిస్థితి మరింత తీవ్రమవుతోంది.
గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలుల హెచ్చరిక
ఈ వాతావరణ మార్పుల ప్రభావంతో తీరం వెంబడి గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశముండటంతో తీరప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచనలందుతున్నాయి.

ఏపీఎస్డీఎంఏ కీలక సూచనలు – మత్స్యకారులకు అప్రమత్తత
రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఈ నేపథ్యంలో తక్షణ చర్యలకు దిగింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్త వహించాలని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేసింది. తీరప్రాంత ప్రజలు తగిన రక్షణ చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు ఎదురైనా వెంటనే స్థానిక అధికారులను సంప్రదించాలని సూచించింది.
శనివారం పలు జిల్లాల్లో వర్ష సూచన
ఈ అల్పపీడన ప్రభావంతో సెప్టెంబర్ 13వ తేదీ శనివారం, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA ప్రకటించింది. ముఖ్యంగా: ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం ఈ జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. మిగిలిన జిల్లాల్లోనూ కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ముఖ్యంగా తీరప్రాంతాల్లో నివసించే ప్రజలు వర్షాలకు, గాలులకు తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. నీటి ప్రవాహానికి లోనయ్యే ప్రాంతాల్లో నివసించే వారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారుల సూచన. స్థానిక సంస్థలు కూడా ప్రజలకు సమయానుగుణంగా సమాచారం అందించాలని APSDMA సూచించింది.
Read hindi news: hindi.vaartha.com
Read also: