ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఏపీపీఎస్సీ (APPSC) తాజాగా శుభవార్తను తెలియజేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 80 పోస్టుల భర్తీకి సంబంధించిన 20 నోటిఫికేషన్లు త్వరలో విడుదల కానున్నాయని కమిషన్ కార్యదర్శి పి. రాజాబాబు వెల్లడించారు.
త్వరలో 20 నోటిఫికేషన్లు విడుదల
విజయవాడలో ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రాజాబాబు (Rajababu) మాట్లాడుతూ, పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్నందున అన్ని నోటిఫికేషన్లను కలిపి ఒకే ఉమ్మడి పరీక్ష నిర్వహించే దిశగా ఆలోచనలు చేస్తున్నామని తెలిపారు. ఈ నెలాఖరులోగా నోటిఫికేషన్లు విడుదల చేసేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు.

గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల జాప్యంపై స్పష్టత
వేలాది మంది అభ్యర్థులు ఆశగా ఎదురుచూస్తున్న గ్రూప్-1, గ్రూప్-2 ఫలితాల విడుదల జాప్యంపై కూడా స్పష్టత ఇచ్చారు. స్పోర్ట్స్ కోటా అభ్యర్థులకు సంబంధించిన తుది జాబితా ఇంకా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) నుంచి రాకపోవడం వల్లే ఫలితాలు విడుదల ఆలస్యం అవుతున్నాయని రాజాబాబు తెలిపారు. జాబితా అందిన వెంటనే ఫలితాలు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు.
గ్రూప్-2 వైద్య పరీక్షల వివరాలు
గ్రూప్-2 పరీక్షలలో ఎంపికైన అభ్యర్థుల వైద్య పరీక్షల ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఇప్పటికీ 1,634 మంది అభ్యర్థుల కంటిచూపు నివేదికలు, 24 మంది అభ్యర్థుల వినికిడి పరీక్షల నివేదికలు రావాల్సి ఉందని పేర్కొన్నారు. ఫలితాలపై సోషల్ మీడియాలో వస్తున్న వదంతులను నమ్మవద్దని అభ్యర్థులకు సూచించారు.
అటవీ శాఖ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి
ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం సెప్టెంబర్ 7న స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 287 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.
ఓఎంఆర్ షీట్పై జాగ్రత్తల సూచన
పరీక్షల సమయంలో అభ్యర్థులు ఓఎంఆర్ షీట్పై వివరాలను పూర్తిగా, స్పష్టంగా నింపాలని, వైట్నర్ ఉపయోగించడం లేదా సమాధానాలను చెరిపివేయడం వల్ల ఆ షీట్లు తిరస్కరించబడతాయని రాజాబాబు హెచ్చరించారు. ప్రశ్నలకు తప్పు సమాధానాలిచ్చినందుకు ప్రతీ మూడు తప్పులకు ఒక నెగటివ్ మార్కు విధించబడుతుందని కూడా స్పష్టం చేశారు.
Read hindi news:hindi.vaartha.com
Read also: