సచివాలయాల్లో ఉద్యోగులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. 2025 మే 31 నాటికి ఒకే సచివాలయంలో ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులకు బదిలీ తప్పనిసరిగా చేసినట్టు ప్రకటించింది. అలాగే సొంత మండలంలో పోస్టింగ్ ఇవ్వకూడదని, బదిలీ అయిన ఉద్యోగుల వివరాలను జులై 10లోగా హెచ్ఆర్ఎంఎస్ పోర్టల్(HRMS Portal)లో అప్లోడ్ చేయాలని ఆదేశించింది. ఒకవేళ బదిలీల తర్వాత కూడా సచివాలయాల్లో ఉద్యోగులు ఎక్కువగా ఉంటే, వారిని ప్రస్తుతం ఉన్నచోటే కొనసాగిస్తారు. దీనికి సంబంధించిన పూర్తి అధికారాలను కలెక్టర్లకు అప్పగించింది. ఈ ప్రక్రియను ఈ నెల 30లోగా పూర్తి చేయాలని ప్రభుత్వం కలెక్టర్లకు సూచించింది.
కారుణ్య నియామకాల
కొన్ని ప్రత్యేక వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించింది.అంధులు, మానసిక వికలాంగులైన పిల్లల తల్లిదండ్రులు, 40 శాతానికి పైగా అంగవైకల్యం ఉన్నవారు, క్యాన్సర్, ఓపెన్ హార్ట్ సర్జరీ, న్యూరో సర్జరీ, కిడ్నీ మార్పిడి చేయించుకున్నవారు, గిరిజన ప్రాంతాల్లో రెండేళ్లకు పైగా పనిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది. వీరితో పాటుగా కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు పొందిన వారికి కూడా ప్రాధాన్యం ఇస్తారు. ఒకవేళ భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులైతే కనుక వారిని వీలైనంత వరకు దగ్గర ప్రాంతాలకు బదిలీ చేయాలని సూచించారు. వీరందరి బదిలీలను రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్లుగా పరిగణిస్తారు.

స్థానంలోకి వేరొకరు
ఈ మేరకు వారందరికి ట్రావెల్ అలవెన్స్ కూడా ఇస్తారు. ఐటీడీఏ ప్రాంతాల్లో (ITDA Areas) మొదట ఖాళీలను నింపాలని, వెనుకబడిన ప్రాంతాల్లో ఖాళీల భర్తీకి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. ఐటీడీఏ ప్రాంతాల నుంచి బదిలీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. బదిలీ అయిన వారి స్థానంలోకి వేరొకరు వచ్చి చేరాకే వారిని రిలీవ్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల హేతుబద్ధీకరణ, బదిలీలను ఒకేసారి చేస్తోంది. ఈ బదిలీలను హేతుబద్ధీకరణకు సంబంధించిన జీవోలను అనుసరించి చేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం సూచనలు చేసింది.
బదిలీల ప్రక్రియ
ఇప్పటికే ప్రభుత్వం జనాభా ప్రకారం గ్రామ, వార్డు సచివాలయాలను కొన్ని కేటగిరీలుగా విభజించింది. ‘ ‘ఏ’ కేటగిరి సచివాలయాల్లో ఆరుగురు, ‘బీ’ కేటగిరిలో ఏడుగురు, ‘సీ’ కేటగిరిలో ఎనిమిది మంది ఉద్యోగులను ఉంచాలి’ అని నిర్ణయించింది. ఈ మేరకు బదిలీల్లో ఈ మార్గదర్శకాలను కలెక్టర్లు(Collectors) పాటించనున్నారు. ఒకవేళ హేతుబద్ధీకరణ, బదిలీల ప్రక్రియ తర్వాత సచివాలయాల్లో మిగిలిన ఉద్యోగులను ఇతర ప్రభుత్వ శాఖలకు డిప్యుటేషన్లపై పంపాలని నిర్ణయించారు. గత ప్రభుత్వం ఒక్కో గ్రామ, వార్డు సచివాలయంలో 8 నుంచి 12 మంది వరకు ఉద్యోగులను నియమించిన సంగతి తెలిసిందే.
Read Also: Kommineni Srinivasa Rao: సుప్రీం కోర్టులో కొమ్మినేని శ్రీనివాసరావుకు ఊరట