ఆంధ్రప్రదేశ్లోని కీలక రవాణా మార్గాల్లో మరొకదైన శ్రీకాళహస్తి – తడ రహదారి అభివృద్ధి దిశగా అడుగులు పడుతున్నాయి. తిరుపతి జిల్లా పరిధిలో ఈ రహదారిని ఆరు లైన్ల మార్గంగా విస్తరించేందుకు ప్రభుత్వం, సంబంధిత శాఖలు సన్నాహాలు ప్రారంభించాయి. ఈ ప్రాజెక్టు శ్రీకాళహస్తి, తడ ప్రాంతాల్లో అభివృద్ధికర ప్రాంతాలైన పారిశ్రామిక జోన్ శ్రీసిటీ సెజ్ (SEZ) అభివృద్ధికి బలమైన మద్దతుగా నిలవనుంది.శ్రీసిటీ సెజ్కు రేణిగుంట విమానాశ్రయం నుంచి నేరుగా రోడ్డు కనెక్టివిటీపై ఫోకస్ పెట్టారు. ఇటీవల కాలంలో పారిశ్రామికవేత్తలు తరచూ శ్రీసిటీకి వస్తుండటంతో ఎయిర్పోర్టు నుంచి త్వరగా చేరుకునేలా ఈ రోడ్డును ఆరులైన్లుగా విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. గతంలో అనుకున్న మార్గంలో కాకుండా శ్రీకాళహస్తి మీదుగా ఉన్న రోడ్డును విస్తరించాలని నిర్ణయించారు.
కొత్త రోడ్డు
శ్రీసిటీకి రేణిగుంట విమానాశ్రయం నుంచి డైరెక్టుగా రోడ్డు కనెక్టివిటీ కల్పిస్తామని సీఎం చంద్రబాబు(CM Chandrababu) చాలాసార్లు చెప్పారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ కూడా శ్రీసిటీ నుంచి రేణిగుంట ఎయిర్పోర్టుకు కనెక్టివిటీ పెంచుతామని ప్రకటించారు. దీనివల్ల పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతుందని భావించారు. కొత్త రోడ్డు నిర్మాణం వల్ల రేణిగుంట, శ్రీసిటీ మధ్య ప్రాంతాల్లో భూముల విలువ పెరుగుతుందని, పెట్టుబడులు వస్తాయని ఆశించారు. కొత్తగా నిర్మించే ఆరు వరుసల రోడ్డు ఆధారంగా పారిశ్రామికవాడలు ఏర్పాటు చేయవచ్చని కూడా అనుకున్నారు.
పరిహారం
ఎయిర్పోర్టు నుంచి శ్రీసిటీకి నేరుగా రోడ్డు వేయడం చాలా ఖర్చుతో కూడుకున్నదని భావించారు. ఆ మార్గంలో విలువైన పంట భూములు ఉండటంతో వాటికి పరిహారం చెల్లించడం భారంగా మారుతుందని అంచనా వేశారు. కొండ ప్రాంతాల మీదుగా రోడ్డు నిర్మాణం చేపట్టాలంటే అంచనా వ్యయం కంటే చాలా ఎక్కువ ఖర్చవుతుందంటన్నారు. దాదాపు రూ.4 వేల కోట్లు అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబుకు నివేదిక ఇచ్చారు.
డబుల్ రోడ్డు
అయితే ఇప్పటికే రేణిగుంట నుంచి నాయుడుపేట, సూళ్లూరుపేట మీదుగా తడకు ఆరు లైన్ల రోడ్డు ఉంది. ఈ మార్గంలో తడకు చేరుకోవడానికి గంటన్నర సమయం మాత్రమే పడుతుంది. కాబట్టి రేణిగుంట ఎయిర్పోర్టు(Renigunta Airport) నుంచి శ్రీసిటీకి కొత్తగా మరో రోడ్డు అవసరం లేదని కలెక్టర్ ముఖ్యమంత్రికి తెలిపారు.అలాగే కలెక్టర్ శ్రీకాళహస్తి నుంచి వరదయ్యపాలెం మీదుగా తడ వరకు ఉన్న డబుల్ రోడ్డును విస్తరిస్తే సరిపోతుంది అన్నారు. గతంలోనే ఈ రోడ్డును నాలుగు లైన్లుగా విస్తరించాలని ప్రతిపాదనలు పంపారని గుర్తు చేశారు. ఇప్పుడు ఆ ప్రతిపాదనల్ని ఆరు లైన్లుగా మారిస్తే సరిపోతుందన్నారు.
ఆదేశాలు
అప్పుడు శ్రీకాళహస్తి-తడ రోడ్డును ఆరు వరుసులగా విస్తరించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని సీఎం నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ రోడ్డును ఆరు లైన్లుగా విస్తరిస్తే శ్రీకాళహస్తి నుంచి తడకు 42 కిలోమీటర్లు ఉంది.అంటే గంటలో శ్రీసిటీకి చేరుకోవచ్చు. ఖర్చు కూడా తగ్గుతందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ రావడంతో త్వరలోనే శ్రీకాళహస్తి తడ హైవేను ఆరులైన్లుగా విస్తరించేందుకు మిగిలిన ప్రక్రియ ప్రారంభించనున్నారు.
Read Also: Visakhapatnam: ఈ నెల 13 నుంచి విశాఖపట్నం నుంచి అబుదాబికి విమాన సర్వీసులు