Andhra Pradesh: ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం!

Read Time:  1 min
Andhra Pradesh: ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం!
FONT SIZE
GET APP

సూపర్ సిక్స్ పథకంలో మరో ముందడుగు

(Andhra Pradesh) లో కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలలో ఒకటైన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై తుది కసరత్తు చేస్తోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉండవల్లి క్యాంపు కార్యాలయంలో అధికారులతో ఈ అంశంపై చర్చించారు. ఆగస్ట్ 15 నుండి ఈ పథకాన్ని అమలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పథకం అమలుతో ఆర్టీసీ బస్సుల్లో (RTC Bus) మహిళల ఆక్యుపెన్సీ గణనీయంగా పెరిగే అవకాశం ఉన్నందున, దానికి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచాలని సీఎం సూచించారు. ఇందుకోసం కొత్త బస్సులు కొనుగోలు చేయడంతో పాటు, అవసరమైతే అద్దెకు తీసుకోవాలని ఆదేశించారు. భవిష్యత్తులో ఆర్టీసీలో ప్రవేశపెట్టే బస్సులన్నీ ఈవీ ఏసీ బస్సులే అయి ఉండాలని, ప్రస్తుతం ఉన్న బస్సులను కూడా ఈవీలుగా మార్చే అవకాశాలపై అధ్యయనం చేయాలని సీఎం అధికారులను కోరారు. ప్రతీ బస్సుకు జీపీఎస్ తప్పనిసరిగా అమర్చాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు.

Andhra Pradesh: ఏపీ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం: కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం!

ఆర్థిక కష్టాలున్నా.. హామీలు నిలబెట్టుకోవాలి

Andhra Pradesh: రాష్ట్రంలో ఆర్థికంగా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ, ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. అదే సమయంలో, ప్రజాధనం సద్వినియోగం కావాలని, ప్రతీ రూపాయి విలువైనదేనని ఆయన అధికారులతో అన్నారు. ఆర్థిక కష్టాలను అధిగమించాలంటే ఆర్టీసీ ఆదాయ మార్గాలను పెంచుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. ఖర్చులు ఎలా తగ్గించుకోవాలి, ఇతర మార్గాల ద్వారా ఆదాయాలను ఎలా పొందాలి అనే దానిపై దృష్టి పెట్టాలని చెప్పారు. ముఖ్యంగా సంస్థ సమర్థతను పెంచుకోవాలని ఆయన ఉద్ఘాటించారు. బస్ కాంప్లెక్స్‌లలో టాయిలెట్లు పరిశుభ్రంగా ఉంచడం దగ్గర నుంచి బస్సు ప్రయాణం వరకు ప్రయాణికుల్లో సంతృప్తి పెరిగేలా నిర్వహణ ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

వివిధ మోడళ్ల పరిశీలనకు సీఎం ఆదేశం

ఆర్టీసీ బస్సుల నిర్వహణ వ్యయాన్ని తగ్గించేందుకు వివిధ మోడళ్లను పరిశీలించాలని సీఎం ఆదేశించారు. బ్యాటరీ స్వాపింగ్ విధానంతో బస్సుల నిర్వహణ వ్యయం తగ్గే అంశాన్ని పరిశీలించాలని సూచించారు. డీజిల్, ఈవీ, సీఎన్‌జీ, బ్యాటరీ స్వాపింగ్ వంటి వివిధ రకాల బస్సుల కొనుగోలు మరియు నిర్వహణకు ఎంత వ్యయం అవుతుందనే ప్రతిపాదనలు రూపొందించాలని కోరారు. బ్యాటరీ, బ్యాటరీ లేకుండా, సర్వీస్ స్టేషన్లను ప్రైవేట్ సంస్థలు నిర్వహించడం, బస్సులను ఆపరేట్ చేయడం వంటి ఏ విధానంతో వ్యయం తగ్గుతుందో పరిశీలించాలని ఆదేశించారు. ఆర్టీసీనే పవర్ జనరేట్ చేసి ఈవీ బస్సులు వినియోగించగలిగితే ఎంతమేర మెయింటెనెన్స్ ఖర్చు తగ్గుతుందనేది అంచనా వేయాలని, దీనిపై పూర్తి స్థాయిలో కసరత్తు జరగాలని ముఖ్యమంత్రి అన్నారు.

అదనంగా 2,045 బస్సులు అవసరం

కొత్త పథకం అమలుకు అదనంగా మరో 2,536 బస్సులు అవసరమని అధికారులు లెక్కలు తేల్చారు. దీనికి సుమారు రూ.996 కోట్లు వ్యయం అవుతుందని అంచనా వేశారు. అలాగే, బస్ స్టేషన్లలో తాగునీటి సౌకర్యం, టాయిలెట్ల నిర్వహణ, బస్సుల సమాచార బోర్డులు, ఇతర సౌకర్యాలను మెరుగుపరచాల్సి ఉందని అధికారులు సీఎంకు వివరించారు.

ఏడాదిలో 88.90 కోట్ల సార్లు ప్రయాణించే అంచనా

రాష్ట్రంలో మొత్తం జనాభా 5.25 కోట్లు కాగా, అందులో మహిళలు 2.62 కోట్లు ఉన్నారు. ప్రస్తుతం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సుల్లో మహిళల ప్రయాణాల సంఖ్య ఏడాదికి 43.06 కోట్లుగా ఉంది. ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు తర్వాత ఈ సంఖ్య 75.51 కోట్లకు పెరగొచ్చని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రతి మహిళ సగటున వారానికి ఒకసారి అయినా ప్రయాణిస్తుంటారని తెలిపారు. ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ప్రస్తుతం మహిళల ప్రయాణాల సంఖ్య 6.85 కోట్లుగా ఉంది. పథకం అమలు తర్వాత ఈ సంఖ్య 13.39 కోట్లకు పెరగొచ్చు. మొత్తమ్మీద, ఉచిత బస్సు పథకంతో మహిళలు ఏడాదిలో 88.90 కోట్ల సార్లు ప్రయాణించే అవకాశం ఉందని అంచనా.

అన్ని రాష్ట్రాలకన్నా ఉత్తమంగా రాష్ట్రంలో అమలు

ప్రస్తుతం ఢిల్లీ, పంజాబ్, తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు మహిళలకు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పిస్తున్నాయి. అయితే, ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధానాన్ని అనుసరిస్తున్నారు. మన రాష్ట్రంలో ప్రవేశపెట్టే విధానం అత్యుత్తమంగా, ప్రయాణికులకు సంతృప్తి కలిగించేలా ఉండాలని ముఖ్యమంత్రి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో మొత్తం బస్సుల్లో 57 శాతం పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ బస్సులు ఉన్నాయి. గత ఏడాదిలో ఇవి 67.76 కోట్ల కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. ఎక్స్‌ప్రెస్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సులు మరో 17 శాతం ఉన్నాయి. రాష్ట్రంలో పెద్ద నగరాలు లేకున్నా, ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాయడంతో కేంద్రం రాష్ట్రానికి బస్సులు కేటాయించింది. రాష్ట్రంలోని 11 మున్సిపల్ కార్పొరేషన్లకు 750 ఈవీ బస్సులను కేంద్ర ప్రభుత్వం అర్బన్ ట్రాన్స్‌పోర్ట్ కింద అందిస్తోంది.

Read also: Chandrababu Naidu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ విస్తృత స్థాయి సమావేశం

Ramya

రచయిత గురించి

Ramya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.