అనంతపురంలో దేశంలోనే అతిపెద్ద రెన్యువబుల్ ఎనర్జీ కాంప్లెక్స్
ఆంధ్రప్రదేశ్లో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత పునరుత్పాదక ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రూపొందించిన ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ (ICE) పాలసీతో పెట్టుబడిదారులు రాష్ట్రంపై మళ్లీ మక్కువ చూపుతున్నారు. ఈ పరిణామాల్లో భాగంగా, అనంతపురం జిల్లా గుంతకల్లు నియోజకవర్గంలోని బేతపల్లిలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ ఎనర్జీ కాంప్లెక్స్ ఏర్పాటు కావడం సంతోషకరం. ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థ రెన్యూ పవర్ ఈ భారీ ప్రాజెక్టును రూ. 22వేల కోట్లతో నిర్మించనుంది. ఈ నెల 16న రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయనున్నారు.
దావోస్ చర్చల ఫలితం – రాష్ట్రంలో మళ్లీ పెట్టుబడుల వెల్లువ
దావోస్లో జరిగిన వరల్డ్ ఎకనమిక్ ఫోరమ్ సదస్సు సందర్భంగా మంత్రి లోకేశ్ మరియు రెన్యూ ఛైర్మన్ సుమంత్ సిన్హా మధ్య జరిగిన వ్యూహాత్మక చర్చల ఫలితంగా, రాష్ట్రంలో ఆరేళ్ల విరామం తర్వాత రెన్యూ పవర్ మళ్లీ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. 2019కి ముందు 777 మెగావాట్ల సామర్థ్యంతో ఏపీ రెన్యువబుల్ రంగంలో పెద్ద ప్రాజెక్టులు అమలు చేసిన రెన్యూ సంస్థ, గత ప్రభుత్వ విధానాలతో నిరుత్సాహం చెందిన విషయం తెలిసిందే.
మూడు విభాగాల్లో భారీగా పెట్టుబడి – సోలార్, విండ్, బ్యాటరీ స్టోరేజీ
రెన్యూ పవర్ ప్రారంభ దశలో 587 మెగావాట్ల సోలార్, 250 మెగావాట్ల విండ్, 415 మెగావాట్ల బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లను రూ. 7వేల కోట్లతో నిర్మించనుంది. మొత్తం ప్రాజెక్టులో 1800 మెగావాట్ల సోలార్, 1 గిగావాట్ విండ్, 2000 మెగావాట్ల బ్యాటరీ సామర్థ్యంతో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ రెన్యువబుల్ పవర్ కాంప్లెక్స్గా ఈ ప్రాజెక్టు ఎదగనుంది. దీనివల్ల రాష్ట్ర గ్రిడ్ సామర్థ్యం, క్లీన్ ఎనర్జీ కెపాసిటీ పెరగడమే కాకుండా దేశంలో ఆంధ్రప్రదేశ్ను పునరుత్పాదక ఇంధన రంగంలో కీలక గమ్యస్థానంగా నిలిపే అవకాశం ఉంది.

వచ్చే ఐదేళ్లలో 72 గిగావాట్ల లక్ష్యం
రాష్ట్రంలో ICE పాలసీ విడుదలైన తర్వాత గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడుల ప్రవాహం మొదలైంది. వచ్చే ఐదేళ్లలో 72 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు తీసుకురావాలన్న లక్ష్యంతో మంత్రి లోకేశ్ ఇప్పటికే పలు కంపెనీలతో చర్చలు జరిపారు. రిలయన్స్ సంస్థ రాష్ట్రవ్యాప్తంగా రూ.65వేల కోట్లతో 500 సీబీజీ ప్లాంట్లు ఏర్పాటు చేయనుండగా, మొదటి ప్లాంట్ను కనిగిరిలో ప్రారంభించారు. ఇదే సమయంలో టాటా పవర్ రూ.49వేల కోట్లతో 7వేల మెగావాట్ల ప్రాజెక్టులను, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్టు రూ.1.86లక్షల కోట్లతో, వేదాంత గ్రూప్ అనుబంధ సంస్థ సెరెంటికా రూ.50వేల కోట్లతో, ఎస్ఎఈఎల్ ఇండస్ట్రీస్ రూ.6వేల కోట్లతో, బ్రూక్ ఫీల్డ్ రూ.50వేల కోట్లతో పెట్టుబడులకు ముందుకొచ్చాయి. ఇవన్నీ కలిపి రాష్ట్రాన్ని గ్రీన్ ఎనర్జీ (Green Energy) పెట్టుబడుల్లో ముందున్న రాష్ట్రాల జాబితాలో నిలిపాయి.
పెట్టుబడిదారుల విశ్వాసానికి ప్రతీకగా ఏపీ
ఇన్ని సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకు ఆసక్తి చూపడం రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న పారదర్శక, పరిశ్రమల అనుకూల విధానాలకు నిదర్శనం. ఫాస్ట్ ట్రాక్ అనుమతులు, ప్రోత్సాహక ప్యాకేజీలు, స్థలాల కేటాయింపు వంటి అంశాల్లో స్పష్టత కలిగిన విధానాలు పెట్టుబడిదారుల్లో విశ్వాసాన్ని కలిగిస్తున్నాయి. ఈ నూతన దిశలో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తుండగా, ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ (Green Energy) రంగంలో ఏపీ ఒక ప్రధాన కేంద్రంగా ఎదిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
read also: Kodali Nani: కొడాలి నానిపై మహ్మద్ ఖాసిం తీవ్ర ఆరోపణలు