ఈ సారి బడ్జెట్లో నిధుల కేటాయింపులను చూస్తే కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో అందించిన వాగ్ధానాలు అతి త్వరలోనే ఆచరణ రూపంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ కీలక కేటాయింపులను చేపట్టారు. ఒక్కసారి కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన నేటి బడ్జెట్ పరిశీలిస్తే ముందుగా ప్రజా రాజధాని అమరావతి నిర్మాణం కోసం రూ.6,000 కోట్లను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు. అలాగే రైతులకు ఎన్నికల సమయంలో అందించిన హామీ ప్రకారం అన్నదాత సుఖీభవ పథకానికి రూ.6,300 కోట్లను కేటాయించారు నేటి బడ్జెట్లో. అలాగే ఏపీకి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు పనులను పూర్తి చేయటానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.6,705 కోట్లను కేటాయించారు.
భరోసా పెన్షన్ కోసం ..
రాష్ట్ర వ్యాప్తంగా పెన్షర్లకు ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల తర్వాత నెలకు పెన్షన్ మెుత్తాన్ని రూ.4,000 కు పెంచిన సంగతి తెలిసిందే. అయితే తాజా బడ్జెట్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కోసం ప్రభుత్వం రూ.27,513 కోట్లను కేటాయించింది. వాస్తవానికి నిధులను తగ్గించినట్లు తెలుస్తోంది. దీనికి అనుగుణంగా అనర్హులకు రాష్ట్రప్రభుత్వం పెన్షన్ తీసేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని కొందరు నిపుణులు భావిస్తున్నారు. అలాగే సూపర్ సిక్స్ హామీల్లో ఒకటైన తల్లికి వందనం కోసం రూ.9,407 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. దీని ద్వారా స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15,000 ఆర్థిక సహాయం అందించటానికి మంత్రి లోకేష్ చెప్పినట్లుగానే నిధుల కేటాయింపు జరిగింది.
మత్యకారుల సంక్షేమానికి ..
ఇదే క్రమంల దీపం 2.0 పథకం కింద రూ.2,601 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్లో కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. మెుత్తానికి ముందుగానే ఊహించినట్లుగా నేటి బడ్జెట్లో ప్రభుత్వం మత్యకారుల సంక్షేమానికి రూ.450 కోట్లను కేటాయించింది. ఇదే క్రమంలో ఊహించినట్లుగానే మహిళలకు ఉచిత రవాణా, ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఆర్థిక సాయం అనే రెండు పథకాలకు నిధుల కేటాయింపులు ఎక్కడా కనిపించలేదు.