వరదల నుంచి విజయవాడను కాపాడుతాం: మంత్రి నిమ్మల

Read Time:  1 min
వరదల నుంచి విజయవాడను కాపాడుతాం: మంత్రి నిమ్మల
FONT SIZE
GET APP

భవిష్యత్తులో వరదల నుంచి విజయవాడను కాపాడుతాం అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో గత సెప్టెంబరులో విజయవాడ నగరం వరద గుప్పిట్లో చిక్కుకోవడం తెలిసిందే. బుడమేరకు గండ్లు పడడంతో విజయవాడను జలవిలయం బారినపడింది. ఈ నేపథ్యంలో, నేడు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ బుడమేరు వరద నియంత్రణపై సమీక్ష నిర్వహించారు.

వరదల నుంచి విజయవాడను కాపాడుతాం: మంత్రి నిమ్మల


వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణం
ఈ సందర్భంగా నిమ్మల మాట్లాడుతూ, నాటి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే బుడమేరు ముంపునకు కారణం అని విమర్శించారు. బుడమేరు వరద నియంత్రణపై సీఎంకు సమగ్ర నివేదిక సమర్పిస్తామని, ఆ మేరకు అధికారులతో సమీక్షించామని తెలిపారు. బుడమేరు వరద వల్ల విజయవాడకు తీవ్ర నష్టం వాటిల్లిందని, విజయవాడ నగరాన్ని కాపాడుకోవడంపై ఓ అవగాహనకు వచ్చామని తెలిపారు. నీటిపారుదల, రెవెన్యూ, పురపాలక శాఖలు సంయుక్త ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయని వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకుని నిధులు సమీకరించాలని నిర్ణయించినట్టు వివరించారు.బుడమేరు పాత కాలువ సామర్థ్యం 3 వేల క్యూసెక్కులకు పెంచాల్సి ఉంటుందని, సామర్థ్యం పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించామని మంత్రి నిమ్మల వివరించారు. సమాంతరంగా కొత్త కాలువ తవ్వేందుకు కూడా అంచనాలకు ఆదేశించామని చెప్పారు.

ఈ అంశాలన్నింటిపై చర్చించేందుకు ఈ నెల 18న మరోసారి సమావేశం నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను ముఖ్యమంత్రికి సమర్పించి, అనంతరం కేంద్రానికి పంపిస్తామని నిమ్మల వెల్లడించారు. సీఎం సూచనలకు అనుగుణంగా బుడమేరు కార్యాచరణ ప్రణాళిక ఉంటుందని అన్నారు. ఈ నెలాఖరు కల్లా పూర్తి నివేదికను సీఎం చంద్రబాబుకు సమర్పిస్తామని వెల్లడించారు.

Vanipushpa

రచయిత గురించి

Vanipushpa

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.