ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కేంద్ర కార్యాలయాల నిర్మాణాలు పట్టాలెక్కనున్నాయి.కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అమరావతి నిర్మాణం మరో అడుగు ముందుకు వేసింది. రాజధాని అమరావతిలో కీలకమైన రెండు ప్రాజెక్టులకు కేంద్రం మంగళవారం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. అమరావతిలో వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు కొలువు దీరనున్నాయి. అయితే అవి వేర్వేరుగా కాకుండా ఒకేచోట ఉండేలా ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. అందులో భాగంగా వివిధ కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల కోసం కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ (Common Central Secretariat) నిర్మించనున్నారు. అలాగే ఈ ఉమ్మడి కేంద్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కీలకమైన ఈ రెండు ప్రాజెక్టులను రూ.2,787 కోట్లతో చేపట్టనున్నారు.
గవర్నమెంట్ కాంప్లెక్స్
రెండు ప్రాజెక్టులనూ కేంద్ర ప్రజాపనుల విభాగం చేపట్టనుంది. ఉమ్మడి కేంద్ర సచివాలయ నిర్మాణం కోసం 2018లోనే అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం 22 ఎకరాల 53 సెంట్లు కేటాయించింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ ఏజీసీ (AGC) పరిధిలో 5.53 ఎకరాలు, దానికి వెలుపల 17 ఎకరాలు ఇచ్చింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ మూడు ముక్కలాటకు దిగడంతో నిర్మాణాలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కూడా ముందుకు రాలేదు. 2024లో కూటమి అధికారంలోకి వచ్చాక ఆ రెండు ప్రాజెక్టుల్ని పునఃప్రారంభించేందుకు ప్రయత్నాలు చేశారు.

కేంద్ర పట్టణాభివృద్ధి
ఈ క్రమంలోనే కీలకమైన ఈ రెండు ప్రాజెక్టుల్ని తిరిగి పట్టాలెక్కించేందుకు ఏపీ ప్రభుత్వం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ వచ్చింది. రాజధానిలో సీపీడబ్ల్యూడీ (CPWD)కి 22.53 ఎకరాల కేటాయించేందుకు మళ్లీ ఆమోదం తెలిపింది. అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన ఢిల్లీ పర్యటనలో కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్లాల్ ఖట్టర్ (Manohar Lal Khattar) ను కలసిన సందర్భంలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి పెమ్మసాని ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ క్రమంలోనే ఈ రెండు ప్రాజెక్టులకు కేంద్ర ఆర్థికశాఖ మంగళవారం ఆమోదం తెలిపింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ధన్యవాదాలు తెలియజేసింది.
Read Also: Kommineni Srinivas: అబద్ధపు ప్రచారాలు చేయవద్దని మీడియాకు కొమ్మినేని హితవు