అమృత ప్రణయ్ కేసు తీర్పు..శ్రవణ్ కుటుంబ సభ్యుల ఆందోళన 2018లో సంచలనం సృష్టించిన ప్రణయ్ పరువు హత్య కేసులో నల్గొండ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఒక వ్యక్తికి ఉరిశిక్ష, మిగిలిన ఆరుగురికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. ఈ తీర్పు తరువాత ప్రణయ్ కుటుంబ సభ్యులు న్యాయపరమైన విజయం సాధించిన భావనతో హర్షం వ్యక్తం చేయగా, శిక్ష పొందిన వారి కుటుంబాలు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాయి. తీర్పు వెలువడిన వెంటనే కోర్టు ఆవరణలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోర్టు తీర్పు వెలువడిన వెంటనే అమృత బాబాయ్ శ్రవణ్ కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కేసులో శ్రవణ్కు జీవిత ఖైదు విధించడంతో ఆయన కుటుంబ సభ్యులు కోర్టు ఆవరణలో ప్రదర్శన చేశారు. “మా నాన్న ఏ తప్పూ చేయలేదు, కానీ అన్యాయంగా శిక్ష విధించారు” అంటూ శ్రవణ్ కుమార్తె పోలీసులతో వాగ్వాదానికి దిగింది. పోలీసులు ఆమెను, ఆమె తల్లిని కోర్టు ఆవరణ నుంచి పంపించేశారు.

ప్రణయ్ తల్లిదండ్రుల స్పందన
తీర్పు తర్వాత ప్రణయ్ తల్లిదండ్రులు తమ కొడుకు సమాధిని సందర్శించి నివాళులు అర్పించారు. “ఈ తీర్పుతో పరువు హత్యలకు అడ్డుకట్ట పడాలని ఆశిస్తున్నాం. ఇకనైనా ఇలాంటి ఘాతుకాలు ఆగాలి” అని ప్రణయ్ తండ్రి పెరుమాల బాలస్వామి భావోద్వేగంగా తెలిపారు. ఈ కేసు విచారణలో సహకరించిన అధికారులకు, న్యాయవాదులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కేసు దర్యాప్తును అప్పటి ఎస్పీ రంగనాథ్ నడిపించారు. మొత్తం 100 మంది సాక్షులను విచారించి, 1600 పేజీల ఛార్జ్ షీటును కోర్టుకు సమర్పించారు. న్యాయవాది దర్శనం నరసింహ ఈ కేసును న్యాయపరంగా సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లారు.
నిందితుల శిక్షలు మరియు జైలు తరలింపు
తీర్పు వెలువడిన అనంతరం, మరణశిక్ష విధించబడిన A2 నిందితుడు సుభాష్ శర్మను చర్లపల్లి జైలుకు తరలించారు. A3 నిందితుడు అస్గర్ అలీని గుజరాత్ సబర్మతి జైలుకు తరలించారు. మిగిలిన ఐదుగురు నిందితులను నల్లగొండ జైలుకు తీసుకెళ్లారు.ఈ తీర్పుతో పరువు హత్యలకు తీవ్ర హెచ్చరికగా నిలుస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. భారతదేశంలో పరువు హత్యలు పెరుగుతున్న నేపథ్యంలో, ఈ కేసు న్యాయవ్యవస్థ ఎంత నిష్పక్షపాతంగా వ్యవహరించిందనడానికి నిదర్శనంగా నిలుస్తుంది. నల్గొండ కోర్టు ఇచ్చిన తీర్పుతో, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.