డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి – దేశవ్యాప్తంగా ఘన నివాళులు
భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక సమానత్వం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానాయకుడు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతిని దేశమంతటా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు, నాయకులు, ప్రముఖులు ఆయన సేవలను స్మరించుకుంటూ హృదయపూర్వకంగా నివాళులర్పించారు. పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ హరివంశ్, రాజ్యసభలో సభా నాయకుడు జెపి నడ్డా, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు నివాళులర్పించారు. దేశానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా వారు ప్రస్తావించారు.
అంబేద్కర్ సేవలను స్మరించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా డాక్టర్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆయనకు ఘన నివాళులు అర్పించారు. అట్టడుగు వర్గాల బాగుపై అంబేద్కర్ చూపిన చొరవను గుర్తుచేసుకుంటూ, ఆయన ఆశయాలను సాకారం చేయడానికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను ప్రారంభించిందని తెలిపారు. నాలెడ్జ్ సెంటర్లు, యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ను అంబేద్కర్ పేరుతో ఏర్పాటు చేస్తున్నామని, రాజీవ్ యువ శక్తి పథకం ద్వారా యువతకు స్వయం ఉపాధిని అందించేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రజల హక్కుల కోసం అంబేద్కర్ చేసిన పోరాటం ప్రపంచానికి ఆదర్శమని పేర్కొంటూ, ఆయన కలల భారతదేశాన్ని నిర్మించేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు.
బీజేపీ నేతల నివాళులు – ఆత్మీయంగా నిర్వహించిన వేడుకలు
నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కూడా అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మరియు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆయన సేవలు స్మరించుకుంటూ పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని, రాష్ట్రంలో సమానత్వం, సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్నామని వారు తెలిపారు.
ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సందేశం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంబేద్కర్ సేవలను గుర్తుచేస్తూ, ఆయన స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా, రాజ్యాంగ నిర్మాతగా దేశానికి చేసిన అమూల్య సేవలు చిరస్మరణీయమని అన్నారు. ‘ఎక్స్’ వేదికగా పోస్ట్ చేస్తూ ఆయనకు హృదయపూర్వక నివాళులు అర్పించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయనకు ఆదరాభిమానాలు తెలుపుతూ ఘనంగా నివాళులు అర్పించారు. అన్ని వర్గాలకూ భరోసా కల్పించే విధంగా కూటమి ప్రభుత్వం అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్తుందన్నారు.
అంబేద్కర్ జీవితం – సామాజిక మార్పు కోసం నిబద్ధత
డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ కేవలం రాజ్యాంగ నిర్మాతే కాదు, సామాజిక సంస్కర్త, ఆర్థికవేత్త, రాజకీయవేత్తగా ఆయన పాత్ర అపూర్వమైనది. సమాజంలో అణగారిన వర్గాలపై ఉన్న వివక్షను తొలగించేందుకు జీవితాంతం కృషి చేశారు. విద్యకు విశేష ప్రాముఖ్యత ఇచ్చిన ఆయన, సామాజిక సమానత్వానికి శాశ్వత మార్గం ఏర్పరిచే రాజ్యాంగాన్ని దేశానికి అందించారు. 1990లో ఆయనకు మరణానంతరంగా భారతరత్న లభించింది – ఇది దేశం తరపున ఆయనకు లభించిన అత్యున్నత గౌరవం. ఈ సందర్భంగా ఆయన సేవలను దేశమంతా గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించడం ఒక గొప్ప ఘనత.
READ ALSO: UPI: దేశ వ్యాప్తంగా మరోసారి యూపీఐ సేవల్లో అంతరాయం