అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదం ఒక్కసారిగా అనేక కుటుంబాలను శోకసంద్రంలో ముంచేసింది. లండన్లో జరగాల్సిన బేబీ షవర్ వేడుక కోసం బయలుదేరిన ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు ఈ విషాద ఘటనలో ప్రాణాలు కోల్పోయారు.వడోదరకు చెందిన యాస్మిన్ వోరా (51), ఆమె మేనల్లుడు పర్వేజ్ వోరా (30), ఆయన నాలుగేళ్ల కుమార్తె జువేరియా ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త వారి కుటుంబ సభ్యులను, బంధువులను తీవ్ర విషాదంలో ముంచింది.యాస్మిన్ వోరా (Yasmin Vora) వాస్తవానికి జూన్ 9వ తేదీనే లండన్కు ప్రయాణం కావాల్సి ఉంది. అయితే, థాస్రాకు చెందిన తన మేనల్లుడు పర్వేజ్, అతని కుమార్తె జువేరియాతో కలిసి ప్రయాణించేందుకు ఆమె తన టికెట్ను 12వ తేదీకి మార్చుకున్నారని యాస్మిన్ భర్త యాసిన్ కన్నీటిపర్యంతమయ్యారు.
ఆవేదన
లండన్లో స్థిరపడిన తమ ఇద్దరు కుమారుల పిల్లల బేబీ షవర్ కార్యక్రమాల కోసం యాస్మిన్ సుమారు ఐదు నుంచి ఆరు నెలల పాటు అక్కడే ఉండాలని ప్రణాళిక వేసుకున్నట్లు ఆయన తెలిపారు.యాసిన్ స్వయంగా యాస్మిన్ను 12న అహ్మదాబాద్ విమానాశ్రయంలో డ్రాప్ చేశారు. విమానం టేకాఫ్ అవడానికి కొద్ది నిమిషాల ముందు యాస్మిన్ తన భర్త యాసిన్కు ఫోన్ చేసి విమానంలో ఏసీ సరిగ్గా పనిచేయడం లేదని, తనకు ఏదో తెలియని ఆందోళనగా, అదోలా అనిపిస్తోందని చెప్పినట్టు యాసిన్ గుర్తుచేసుకున్నారు. “అలాంటిదేమీ ఉండదు, కాసేపటికి ఏసీ ఆన్ అవుతుందిలే అని నేను ఆమెకు ధైర్యం చెప్పాను” అని ఆయన ఆ చివరి సంభాషణను తలుచుకుంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

గుర్తింపు కోసం
యాసిన్ విమానాశ్రయం నుంచి సుమారు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణించిన తర్వాత మధ్యాహ్నం 1:10 గంటలకు లండన్ బయలుదేరిన విమానం కుప్పకూలిపోయిందని బంధువుల నుంచి ఆయనకు ఫోన్ కాల్ వచ్చింది. ఆ వార్త విన్న ఆయన నిర్ఘాంతపోయారు. మధ్యాహ్నం 3 గంటల కల్లా అందిన మృతుల జాబితాలో యాస్మిన్, పర్వేజ్, జువేరియా పేర్లు ఉండటంతో వారి కుటుంబంలో పెను విషాదం నెలకొంది.చిన్నారి జువేరియాకు ఇక్కడ దంత చికిత్స (Dental treatment) చేయించిందని యాసిన్ తెలిపారు. పోస్ట్మార్టం గది వెలుపల మృతదేహాల గుర్తింపు కోసం పర్వేజ్ కజిన్లు ఫరూక్, సోహైల్ తదితర కుటుంబ సభ్యులు వేచి ఉన్నారు. ఒక సంతోషకరమైన వేడుక కోసం ఆరంభమైన ప్రయాణం ఇలా విషాదాంతం కావడం అందరినీ కలచివేసింది.
Read Also: Singareni: సింగరేణిలో ప్లాస్టిక్ నిషేధం..రూల్స్ బ్రేక్ చేస్తే రూ.10 వేల ఫైన్