తమిళనాడు (Tamil Nadu)లోని పొల్లాచిలో 2019లో వెలుగు చూసిన లైంగిక వేధింపుల కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో నిందితులుగా ఉన్న తొమ్మిది మందిని కోయబంత్తూర్లోని సెషన్స్ కోర్టు దోషులుగా తేల్చింది.
నిందితులు తొమ్మిది మంది 2019 నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. వారిని మంగళవారం కట్టుదిట్టమైన భద్రతతో సెషన్స్ కోర్టుకు తీసుకొచ్చారు. ఈ కేసు విచారణలో భాగంగా న్యాయస్థానం వీరందరినీ దోషులుగా తేల్చింది. మధ్యాహ్నం వీరికి శిక్షను ఖరారు చేయనుంది. అయితే, దోషులకు జీవిత ఖైదు విధించాలని బాధితుల తరఫు న్యాయవాదులు న్యాయస్థానాన్ని కోరారు.

కళాశాల విద్యార్థినితో మొదలైన దుర్మార్గం
2016-2018 మధ్య కాలంలో ఒక కళాశాల విద్యార్థినితో సహా పలువురు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన కేసు ఇది. నిందితులు మహిళలను లైంగికంగా వేధించడమే కాకుండా వాటిని మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. వాటిని ఉపయోగించి మహిళలను డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో మొత్తం 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. తొలుత ఈ కేసును పొల్లాచి పోలీసులు విచారణ చేశారు. అనంతరం తమిళనాడు(Tamil Nadu) క్రైమ్ బ్రాంచ్- క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ (CB-CID)కు బదిలీ చేశారు. ఆ తర్వాత సీబీఐకి బదిలీ చేశారు. ఈ కేసు అప్పట్లో తమిళనాడు(Tamil Nadu)లో పెద్దఎత్తున సంచలనం సృష్టించింది. రాజకీయంగానూ తీవ్ర దుమారం రేపింది. ఈ కేసు దర్యాప్తు సమయంలో బాధితుల తరఫున 200కు పైగా పత్రాలను, 400 ఎలక్ట్రానిక్ పరికరాలను ఆధారాలుగా చూపించారు.