బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్ అయ్యారు. రైతు రుణమాఫీ కాని రైతులు ఎవరైనా ఉంటే ప్రభుత్వం రుణమాఫీ చేయడానికి సిద్ధంగా ఉందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో మంత్రి పొన్నం ప్రభాకర్ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. రైతు రుణమాఫీపై బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అబ్బద్దాలు చెబుతున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ సంవత్సరంలోపే 50 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని గుర్తుచేశారు. ఉపాధి హామీకి సంబంధించి కూలీలకు రూ.12 వేలు ఇస్తున్నామని అన్నారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీపై ఉమ్మడి దాడి చేస్తున్నాయని మండిపడ్డారు. నల్ల చట్టాలు తెచ్చి 750 మంది రైతుల చావుకు కారణం అయింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు.

బీజేపీ నేతలకు ఛాలెంజ్ చేస్తున్న తాము అమలు చేస్తున్న పథకాలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్నారా అని నిలదీశారు. రైతు భరోసా రూ. 12000 ఇస్తామంటే బీఆర్ఎస్, బీజేపీ నేతలు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తాము ఇచ్చిన హామీలు క్రమ క్రమంగా అమలు చేస్తున్నామని అన్నారు.
క్రీడలకు ప్రాధాన్యం
హుస్నాబాద్లో క్రీడలకు ప్రాధాన్యం కల్పిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హుస్నాబాద్ పట్టణంలో ఇవాళ(సోమవారం) మంత్రి పొన్నం ప్రభాకర్ మార్నింగ్ వాక్ చేశారు. పట్టణ ప్రజలతో కలిసి పలు వీధుల గుండా నడుస్తూ ఎల్లమ్మ చెరువు వరకు మార్నింగ్ వాక్ చేశారు. పిల్లలు, వృద్ధులతో ముచ్చటిస్తూ అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఉదయం నడక అలవాటు చేసుకోవాలని సూచించారు. తమ ప్రభుత్వం క్రీడలకు అధిక ప్రాధాన్యం ఇస్తోందని. క్రీడాకారులు తెలంగాణకు మంచి పేరు తీసుకురావాలని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.