రాజధాని అమరావతి అంశం మరోసారి రాజకీయంగా వేడెక్కింది. ఈసారి ప్రశ్నల దాడికి దిగింది ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. గతంలో భూముల సేకరణకు సంబంధించి ఎంత ఉపయోగం జరిగిందో చెప్పాలని ఆమె స్పష్టం చేశారు. ముఖ్యంగా 34 వేల ఎకరాల భూమి సేకరించి వాటితో ఏం చేశారు అన్నది ఆమె ప్రధాన ప్రశ్న.”ఇప్పటికే భూములు ఉన్నాయి. అయినా ఎందుకు మళ్లీ సేకరణ?” అని షర్మిల ప్రభుత్వాన్ని నిలదీశారు. గత టీడీపీ హయాంలో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన ఈ భారీ భూమిలో అసలు అభివృద్ధి ఏమాత్రం కనిపించలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు కొత్తగా మరో 44 వేల ఎకరాలు ఎందుకు అవసరమయ్యాయి? ప్రజల పైన మళ్లీ భారం వేయాలనే ఆలోచనా? అని షర్మిల చురకలంటించారు.

చంద్రబాబు పై సెటైరికల్ ధాటిగా విమర్శలు
“చూపించని అభివృద్ధి, వాయిదాపైనే మాటలు, ఇది చంద్రబాబు స్టైల్,” అంటూ ఆమె ఎద్దేవా చేశారు. రాజధాని పేరుతో ఎగరేసిన కలలు ఇప్పటికీ గ్రాఫిక్స్ల్లోనే ఉన్నాయంటూ విమర్శించారు. “వైకుంఠాన్ని అరచేతిలో చూపించే విధానం చంద్రబాబుదే. రియల్ ఎస్టేట్ డ్రీమ్స్ చూపించి ప్రజలను మోసం చేస్తున్నారు” అని ఆమె ఘాటుగా వ్యాఖ్యానించారు.షర్మిల ఆరోపణల ప్రకారం – ఇదంతా రాజకీయ వ్యాపారం. రైతుల విలువైన భూములను తక్కువ ధరకే తీసుకొని, తన అనుచరులకు ఇవ్వడం ద్వారా రియల్ ఎస్టేట్ లాభాలు పొందాలని చూస్తున్నారట. ప్రజల రాజధాని అంటే మాటల్లో తప్ప చేతల్లో కనిపించదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రశ్నల వరదలో చంద్రబాబు
“ఫేజ్-1 లో సేకరించిన 34 వేల ఎకరాల్లో నిజంగా ఎంత అభివృద్ధి జరిగింది? రెండు వేల ఎకరాలు మిగలడం ఎలా? మిగతా భూములను ఎవరికిచ్చారు? ఏ సంస్థలకు కేటాయించారు? భూములు కేటాయించిన ప్రాతిపదిక ఏంటి?” అనేలా ఆమె ప్రశ్నల వర్షం కురిపించారు.”ఇప్పటికైనా ప్రజలకు స్పష్టత ఇవ్వాలి. ఈ 34 వేల ఎకరాల భూమిపై పూర్తిస్థాయి శ్వేతపత్రం విడుదల చేయాలి,” అంటూ షర్మిల ప్రభుత్వాన్ని కోరారు. అభివృద్ధిపై నిజాలు తెలియజేయడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజల పక్షాన తాము అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు.
తీర్పు ప్రజలదే
షర్మిల ఆరోపణలు తాజా రాజకీయ చర్చకు దారి తీసేలా ఉన్నాయి. రాజధాని నిర్మాణం, భూముల వినియోగం, ప్రజల విశ్వాసం అన్నీ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారాయి. ప్రభుత్వం ఈ ఆరోపణలకు ఎలా స్పందిస్తుందో చూడాలి.
Read Also : CM Chandrababu : నేడు గుంటూరుకు సీఎం.. ‘P-4’ సభ్యులతో భేటీ