మన నిత్య జీవితంలో ఆధార్ కార్డు ప్రాముఖ్యత ఎంతగానో ఉంది. ప్రభుత్వ పథకాలు పొందడం నుంచి, బ్యాంకింగ్, విద్యా సంస్థలు, గవర్న్మెంట్ కార్యాలయాలు వంటి ప్రతి రంగంలో ఆధార్ తప్పనిసరి అయింది. తాజాగా, ఆధార్ వినియోగాన్ని మరింత సులభతరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆధార్కు సంబంధించిన కొత్త యాప్ను తీసుకురానుంది. ఈ యాప్ను యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) అభివృద్ధి చేస్తోంది. కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకారం, ఇది యూజర్ ఫ్రెండ్లీ యాప్ అవుతుంది. ఫేస్ రికగ్నిషన్, క్యూఆర్ కోడ్ స్కానింగ్ వంటి ఆధునిక టెక్నాలజీలతో ఈ యాప్ పని చేస్తుంది.
యాప్ ద్వారా సెల్ఫీ తీసి UIDAI డేటాబేస్తో వేరిఫై
ఈ ఆధార్ యాప్ ద్వారా వ్యక్తిగత గుర్తింపును వేగంగా, సురక్షితంగా ధృవీకరించుకోవచ్చు. దీనిలో, ముందుగా అవసరమైన ప్రదేశంలో ఉన్న QR కోడ్ను స్కాన్ చేసి, తర్వాత యాప్ ద్వారా సెల్ఫీ తీసి UIDAI డేటాబేస్తో వేరిఫై చేస్తారు. ఇలా చేయడం వల్ల ఒరిజినల్ ఆధార్ కార్డు తీసుకెళ్లాల్సిన అవసరం లేకుండా పోతుంది. అవసరమైన డేటా మాత్రమే షేర్ కావడం వల్ల డేటా ప్రైవసీ కూడా బాగానే రక్షితమవుతుంది. ఈ విధానం ఫేక్ డాక్యుమెంట్లను గుర్తించడంలో, సైబర్ మోసాల నివారణలో సహాయపడుతుంది.
ఆధార్ యాప్ బీటా వెర్షన్లో టెస్టింగ్
ప్రస్తుతం ఈ ఆధార్ యాప్ బీటా వెర్షన్లో టెస్టింగ్ దశలో ఉంది. కనుక ఇది ఇంకా గూగుల్ ప్లే స్టోర్లో అందుబాటులోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఎవరు ఏమైనా కాల్ ద్వారా లేదా లింక్ పంపి యాప్ డౌన్లోడ్ చేయమంటే జాగ్రత్తగా ఉండాలి. అధికారికంగా UIDAI ద్వారా విడుదలైనప్పుడే మాత్రమే యాప్ను డౌన్లోడ్ చేయాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. డిజిటల్ ఆధార్ వాడకాన్ని మరింత సురక్షితంగా, సులభంగా మార్చే దిశగా ఈ యాప్ ఒక కీలక అడుగుగా నిలవనుంది.