Jammu Kashmir: ఇరాన్ అత్యున్నత నాయకుడు అయతొల్లా అలీ ఖమేనీ మరణవార్త జమ్మూకశ్మీర్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఖమేనీ మృతికి నిరసనగా శ్రీనగర్లోని షియా ముస్లిం వర్గీయులు భారీ ఎత్తున వీధుల్లోకి వచ్చి ఆందోళన చేపట్టారు. ఇరాన్ జెండాలను ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ నిరసనకారులు ముందుకు సాగడంతో లోయలో అశాంతి నెలకొంది. పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు, ఆందోళనకారులను చెల్లాచెదురు చేయడానికి టియర్ గ్యాస్ (భాష్పవాయువు) ప్రయోగించాల్సి వచ్చింది.
Read Also:Afghanistan: పాక్ సైనిక స్థావరాలపై ఆఫ్ఘాన్ వైమానిక దాడులు
శ్రీనగర్లో ఉదయం నుంచే షియా సామాజిక వర్గం బంద్కు పిలుపునివ్వడంతో వ్యాపార సముదాయాలు, విద్యాసంస్థలు మూతపడ్డాయి. నిరసన ప్రదర్శనలు హింసాత్మకంగా మారకుండా ఉండేందుకు భద్రతా బలగాలు భారీగా మోహరించాయి. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా కశ్మీర్ లోయలోని పలు సున్నిత ప్రాంతాల్లో ఆంక్షలు కఠినతరం చేశారు. ముఖ్యంగా శ్రీనగర్ పాత బస్తీ ప్రాంతంలో పరిస్థితిని అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.
ఈ పరిణామాల నేపథ్యంలో కేంద్ర నిఘా సంస్థ (IB) దేశవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించింది. కశ్మీర్లో చోటుచేసుకుంటున్న ఉద్రిక్తతలు ఇతర రాష్ట్రాలకు పాకే అవకాశం ఉందని భావించిన ఐబీ, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కీలక సూచనలు జారీ చేసింది. ముఖ్యంగా లక్నో వంటి షియా జనాభా అధికంగా ఉన్న నగరాల్లో అదనపు భద్రత కల్పించాలని, మతపరమైన ప్రసంగాల ద్వారా ఘర్షణలు తలెత్తకుండా నిఘా ఉంచాలని హెచ్చరించింది. అల్లర్లు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: