వైద్య వృత్తి ముసుగులో కొందరు మోసగాళ్లు అమాయక ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అక్షరం ముక్క రాకపోయినా తెల్లకోటు తగిలించుకుని, మెడలో స్టెతస్కోపు వేసుకుని క్లినిక్లు నడుపుతున్న నకిలీ వైద్యుల ఘటనలు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్నాయి. వైద్య విద్య లేకపోయినా వైద్యు డిగా నటించడం కేవలం చట్టవ్యతిరేక చర్య మాత్రమేకాదు, అది ప్రత్యక్షంగా ప్రాణహానికి దారితీసే నేరం. ఆంధ్రప్రదేశ్ లోని సింగరాయకొండలో రక్తపరీక్ష కేంద్రం నిర్వహించే వ్యక్తి తనను తాను వైద్యుడిగా ప్రకటించుకుని నాలుగేళ్ల బాలుడికి చికిత్స పేరుతో ప్రాణాపాయం కలిగించిన సంఘటన ప్రజలను కలచివేసింది. అలాగే చిత్తూరు జిల్లాలో పదో తరగతి కూడా చదవని వ్యక్తులు క్లినిక్ లు ప్రారంభించి అమాయకులను మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వచ్చాయి. తెలంగాణలోని సూర్యాపేటలో నకిలీ వైద్యుల (Fake doctors)నిర్లక్ష్యంతో కొద్ది రోజుల్లోనే ఇద్దరు మహిళలు మృతి చెందిన ఘటనలు నమోదయ్యాయి. టెక్నీషియన్గా పనిచేసే వ్యక్తి వైద్యుడిగా నటించి గర్బిణీలపై అక్రమ శస్త్రచికిత్సలు చేయ డం వంటి సంఘటనలు మరింత భయాందోళన\ కలిగిస్తు న్నాయి. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల్లోనే అనుమతులు లేని వందలాది ఆసుపత్రులు నడు స్తున్నాయని అంచనాలు చెబుతున్నాయి. ఇవన్నీ కేవలం బయటపడిన సంఘటనలే కాని, లోతులో ఇంకా ఎన్నో ఉదంతాలు దాగి ఉన్నాయనే అనుమానం వ్యక్తమవుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదికల ప్రకారం భారతదేశంలో అల్లోపతి వైద్యులుగా చలామణీ అవుతున్న వారిలో సగానికి పైగా మందికి సరైన అర్హతలు లేవని వెల్లడైంది. వీరిలో గణనీయమైన శాతం కేవలం పాఠశాల విద్యతోనే సరిపెట్టు కున్నవారేనని అధ్యయనాలు చెబుతున్నాయి. భారతీయ వైద్య సంఘం అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో నకిలీ వైద్యులు కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు.. చికిత్స సమయంలో సంభవిస్తున్న మరణాల్లో గణనీయ మై న శాతం ఈనకిలీ వైద్యుల నిర్లక్ష్యం అవగాహనలేమి కార ణంగానే జరుగుతున్నట్లు వివిధ అధ్యయనాలు సూచిస్తున్నా యి. తెలంగాణలో రాష్ట్ర వైద్య మండలి గత కొంతకాలంలో వందలాది కేసులు నమోదు చేసినప్పటికీ, అర్హతలు లేని వేలాది మంది ఇంకా వైద్యం పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారనే అంచనాలు ఉన్నాయి. ఉన్నత న్యాయస్థానం కూడా గతంలో నకిలీ వైద్యం సమాజానికి పెనుముప్పు అని హెచ్చరించినప్పటికీ, ఆ హెచ్చరికలు కాగితాలకే పరిమితమ వుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి.
Read Also : http://Gujarat Demolition: రాజ్కోట్లో భారీ కూల్చివేత డ్రైవ్కు నోటీసులు
నకిలీ వైద్యుల వల్ల కలిగే నష్టం కేవలం తక్షణ ప్రాణాపాయం మాత్రమే కాదు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు కూడా దారితీస్తోంది. అధిక మోతాదులో యాంటీబయాటిక్స్, స్టెరాయిడ్లు ఇవ్వ డం వల్ల శరీర నిరోధక శక్తి దెబ్బతింటోంది. మందులకు పనిచేయని వ్యాధులు పెరుగుతున్నాయి. చిన్న జ్వరమే ప్రాణాంతకంగా మారే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శస్త్ర చికిత్సల పేరిట అవగాహనలేని చర్యలు తీసుకుని రోగుల అవయవాలను దెబ్బతీయడం, శాశ్వత వైకల్యాలకు గురి చేయడంవంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా పేదలు, గ్రామీణులు, నగర పేదవర్గాలు తక్కువ ఖర్చు తో చికిత్స దొరుకుతుందనే నమ్మకంతో ఈ మోసగాళ్ల వద్దకు వెళ్లి ప్రాణాలు కోల్పోతున్నారు. ఈసమస్యకు మూల కారణాలు అనేకం. చట్టాల అమలులో సమన్వయ లోపం, వైద్య మండలి, పోలీసు శాఖ, ఔషధ నియంత్రణ విభాగాల మధ్య సమర్థవంతమైన అనుసంధానం లేకపోవడం, తక్కు వ శిక్షలు, అవినీతి ఆరోపణలు, గ్రామీణ ప్రాంతాల్లో అర్హు లైన వైద్యుల కొరత వంటి అంశాలు నకిలీలకు అవకాశాలు గా మారుతున్నాయి. రూరల్ మెడికల్ ప్రాక్టీషనర్స్ పేరుతో కొందరు చట్టపరమైన సందిగ్ధతను ఉపయోగించుకుని అల్లో పతి వైద్యంచేయడం పరిస్థితిని మరింత సంక్లిష్టం చేస్తోంది. ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అత్య వసరం. అనుమతులు లేని క్లినిక్లు, ఆసుపత్రులను గుర్తించి వెంటనే మూసి వేయాలి. మోసం, ప్రజారోగ్యానికి హాని వంటి నేరాల కింద కఠిన శిక్షలు విధించి, బెయిల్ సులభంగా లభించని విధంగా చట్టాలను అమలు చేయాలి. ప్రతి వైద్యుడి నమోదు సంఖ్యను ప్రజలకు అందుబాటులో ఉంచి, రోగులు సులభంగా ధృవీకరించుకునే విధానాలను అమలు చేయాలి. ప్రజల్లో అవగాహన పెంపొందించి అర్హత లేని వ్యక్తుల వద్ద చికిత్స పొందడం ప్రాణాపాయం అని స్పష్టంగా తెలియజేయాలి. మందులు దుర్వినియోగాన్ని నియంత్రించే కార్యక్రమాలు అమలు చేయాలి. స్వాతంత్ర్యం సాధించి దశాబ్దాలు గడిచినా, అర్హతలు లేని వారు వైద్యు లుగా కొనసాగడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మచ్చ. వైద్యం పాణరక్షణ మార్గం కావాలి గాని ప్రాణహానికర యమపాశం కాకూడదు. ప్రభుత్వాలు, వైద్యసంఘాలు, మీడియా, ప్రజలు అందరూ కలిసి ఈనకిలీ వైద్యుల (Fake doctors) వ్యవస్థను పూర్తిగా నిర్మూ లించాలి. ప్రజారోగ్యాన్ని కాపాడటం ప్రభుత్వాల బాధ్యత మాత్రమే కాదు, సమాజం కర్తవ్యం కూడా.
-ఈ. శ్రీనివాస్ రావు
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: