హైదరాబాద్ నగరంలో ఇటీవల వరుసగా ఏటీఎం దోపిడీలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. పాత భద్రతా వ్యవస్థలు ఉన్న ఏటీఎంలను టార్గెట్ చేసుకుంటున్న దొంగలు, ముందుగా సీసీటీవీ కెమెరాలను ధ్వంసం చేసి, బ్యాంక్లోని నగదు ఎత్తుకెళుతున్నారు. ముఖ్యంగా రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో చోరీల సంఖ్య పెరుగుతుండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఈ ఘటనలపై పోలీసు విభాగం ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ శివారు మహేశ్వరం మండలం రావిర్యాలలో జరిగిన ఏటీఎం దోపిడీ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. SBI ఏటీఎంను లక్ష్యంగా చేసుకున్న దుండగులు గ్యాస్ కట్టర్ ద్వారా ఏటీఎంను తెరిచి 30 లక్షల రూపాయలు ఎత్తుకెళ్లారు. విచారణలో భాగంగా పోలీసులు హర్యానా రాష్ట్రానికి చెందిన మేవత్ గ్యాంగ్పై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదే గ్యాంగ్ గతంలో పలు నగరాల్లో ఇలాంటి దోపిడీలకు పాల్పడిందని అధికారులు భావిస్తున్నారు

మైలార్ దేవ్ పల్లిలో చోరీకి యత్నం – షార్ట్ సర్క్యూట్ కలకలం
ఏటీఎం దోపిడీ కోసం వచ్చిన దొంగలు మైలార్ దేవ్ పల్లిలోని మరో SBI ఏటీఎంను టార్గెట్ చేశారు. అయితే, అనుకోకుండా షార్ట్ సర్క్యూట్ జరిగి మంటలు చెలరేగడంతో దొంగలు భయంతో పారిపోయారు. పోలీసులు తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటన తర్వాత పోలీసులు ఏటీఎంల భద్రతను పటిష్ఠం చేయాలని నిర్ణయించారు. ఈ వరుస దోపిడీల నేపథ్యంలో రాచకొండ, సైబరాబాద్ పోలీసులు ఉక్కుపాదం మోపేందుకు సిద్ధమయ్యారు. అయితే రావిర్యాల దోపిడీలో కేవలం నాలుగు నిమిషాల్లోనే 30 లక్షలు ఎత్తుకెళ్లిన తీరును చూస్తే, ఈ ముఠాకు ప్రత్యేకమైన శిక్షణ ఉండి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. దీనికోసం మొత్తం 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే అనేక ఆధారాలను సేకరించిన పోలీసులు, నిందితులు ముంబై వైపు పారిపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. మార్చి 1న కర్ణాటకలోని హోస్కోటేలో ఇదే తరహా దోపిడీ జరిగినట్లు గుర్తించడంతో, రాచకొండ పోలీసులు కర్ణాటక పోలీసులతో సమన్వయం చేస్తున్నారు. ఒకే విధానంతో చోరీలు జరిగాయి కాబట్టి, ఇక్కడి మేవత్ గ్యాంగ్ దొంగతనాలకు పాల్పడిందా? అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.
హైదరాబాద్లో బ్యాంకుల సంచలన నిర్ణయాలు
ఈ వరుస దోపిడీల నేపథ్యంలో బ్యాంకులు కూడా అప్రమత్తమయ్యాయి. పాత భద్రతా వ్యవస్థలను నవీకరించేందుకు, రాత్రిపూట ఏటీఎంల వద్ద భద్రతను పెంచేందుకు నిర్ణయించాయి. ముఖ్యంగా కొత్త తరహా భద్రతా సాంకేతికతను వినియోగించి, మోటారైజ్డ్ లాకింగ్ సిస్టమ్స్, అలారమ్ సిస్టమ్స్ అమలు చేయాలని నిర్ణయించాయి. అయితే ఈ కొత్త తరహా దొంగతనాల్లో దొంగలు సీసీటీవీలను పనిచేయకుండా చేయడానికి కెమెరాలపై స్ప్రే కొడుతున్నారు. తద్వారా తమకు సంబంధించిన ఆధారాలు మిగలకుండా చేస్తున్నారు. అలాగే, ఏటీఎంను విప్పేందుకు గ్యాస్ కట్టర్ను వినియోగిస్తున్నారు. హైదరాబాద్లో వరుస ఏటీఎం దోపిడీలు భద్రతా లేమిని వెలుగులోకి తీసుకువచ్చాయి. పోలీసులు తక్షణ చర్యలు తీసుకుంటున్నా, బ్యాంకులు మరింత అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా పాత భద్రతా వ్యవస్థలను మార్చి, అధునాతన సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉంది. ఏటీఎంల వద్ద భద్రతను పెంచడం, నిఘా పెంచడం ద్వారా ఈ తరహా దోపిడీలను అరికట్టవచ్చు.