భారత మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతి దేశాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో గురువారం రాత్రి ఆయన తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన మృతి పట్ల దేశవ్యాప్తంగా ప్రముఖులు, రాజకీయ నేతలు సంతాపం వ్యక్తం చేశారు. మన్మోహన్ సింగ్ తన ఆర్థిక నైపుణ్యంతో భారత ఆర్థిక వ్యవస్థను కొత్త దిశగా నడిపిన నేతగా గుర్తింపు పొందారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు , డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహా తెలుగు రాష్ట్రాల నేతలు ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.”గొప్ప ఆర్థికవేత్తల్లో ఒకరు, నాయకులు, సంస్కర్త, అన్నింటికంటే మించి మన కాలంలోని మానవతావాది మన్మోహన్ సింగ్ జీ ఇక లేరు. సద్గుణం, నిష్కళంకమైన సమగ్రత, నిర్ణయం తీసుకోవడంలో అన్నింటికంటే మానవీయతో చూసే వ్యక్తి. డాక్టర్ సింగ్ న్యూ ఇండియాకు నిజమైన వాస్తుశిల్పుల్లో ఒకరు. రాజకీయ & ప్రజా జీవితానికి మర్యాద ఎంత అవసరమో చూపించారు. ఆయన ఒక లెజెండ్, ఆయన మరణం భారతదేశం ఒక గొప్ప కుమారుడిని కోల్పోయింది” అని రేవంత్ అన్నారు.
“మేధావి రాజనీతిజ్ఞుడు, వినయం, జ్ఞానం, కలగలిపిన వ్యక్తి. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన చేసిన ఆర్థిక సంస్కరణల నుంచి ప్రధానమంత్రిగా ఆయన నాయకత్వం వరకు దేశానికి అవిశ్రాంతంగా సేవలందించి లక్షలాది మందిని ఉద్ధరించారు. ఆయన మృతి దేశానికి తీరని లోటు. ఆయన కుటుంబానికి, ఆత్మీయులకు, అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతి” అంటూ చంద్రబాబు పేర్కొన్నారు. 1991 ఆర్థిక సంస్కరణలు, ప్రధానిగా చేసిన ప్రజాసేవల వల్ల ఆయన పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుందని పవన్ కల్యాణ్ అన్నారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ నేత బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వంటి నేతలు కూడా మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడారు. పీవీ నరసింహరావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా పనిచేసిన మన్మోహన్ సింగ్ ఆర్థికరంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారు. ముఖ్యంగా ప్రపంచీకరణ, ఆర్థిక సంస్కరణల అమలులో ఆయన కీలక పాత్ర పోషించారు.
దేశ వ్యాప్తంగా ప్రజాసేవలను మరింతగా ముందుకు తీసుకువచ్చేందుకు సంక్షేమ పథకాలను అమలు చేసిన మన్మోహన్ సింగ్ ప్రధానిగా పేదల సంక్షేమానికి విశేషమైన కృషి చేశారు. మహాత్మా గాంధీ ఉపాధి పథకం, రైతు రుణమాఫీ వంటి పథకాలు ఆయన హయాంలోనే ప్రారంభమయ్యాయి. తృణధాన్యాలు పంపిణీతో పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచారు.
మన్మోహన్ సింగ్ మృతి పట్ల దేశ వ్యాప్తంగా వారిని అభిమానించే రాజకీయ నాయకులు, సామాన్య ప్రజలు తీవ్ర విషాదంలో ఉన్నారు. దేశానికి ఒక గొప్ప ఆర్థిక నిపుణుడు, వివేకవంతమైన నాయకుడు కోల్పోయామన్న భావన వ్యక్తమవుతోంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని పలువురు ప్రార్థించారు.