భారత రాజకీయ చరిత్రలో చిరస్మరణీయ నేత గా నిలిచిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్యంతో కొన్ని రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన 91 ఏళ్ల వయసులో ఈ లోకాన్ని విడిచిపెట్టడం దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేసింది. మన్మోహన్ సింగ్ మృతి పట్ల తెలంగాణ ప్రభుత్వం విచారం వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు ఈరోజు (డిసెంబరు 27) సెలవు ప్రకటించింది. తెలంగాణ సీఎస్ శాంతి కుమారి గురువారం రాత్రి ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే, వారం రోజులపాటు రాష్ట్రంలో సంతాప దినాలు పాటించనున్నట్లు ప్రకటించారు.
కేంద్ర ప్రభుత్వం కూడా మన్మోహన్ సింగ్ మృతిని గౌరవిస్తూ వారం రోజులపాటు సంతాప దినాలు పాటించనుంది. ఈరోజు (డిసెంబరు 27) కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలను కూడా రద్దు చేశారు. ఈ ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మన్మోహన్ సింగ్ సేవలకు గౌరవం చెల్లించనున్నారు. మన్మోహన్ సింగ్ అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఆయన అంతిమ యాత్ర ఢిల్లీలోని రాష్ట్రీయ ఘాట్ వద్ద జరుగుతుంది. దేశవ్యాప్తంగా ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆయనకు ఘన నివాళులర్పించేందుకు ఢిల్లీకి చేరుకుంటున్నారు.