తెలంగాణ రాజకీయాల్లో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరి పాకాన పడింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడుస్తున్నా, నిరుద్యోగులకు ఇచ్చిన కీలక హామీలను నెరవేర్చలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న హామీ ఏమైంది?” అని ఆయన ప్రశ్నించారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, నిరుద్యోగుల ఆశలతో ఆడుకుంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వారి ఉసురు తగలడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. ఇచ్చిన మాట తప్పి సీఎం ముఖం చాటేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

కేవలం నిరుద్యోగ సమస్యే కాకుండా, వ్యవసాయ రంగాన్ని కూడా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. వరుసగా మూడు దఫాలుగా రైతుబంధు నిధులను నిలిపివేసి, దాదాపు 70 లక్షల మంది అన్నదాతల పొట్టకొట్టారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో రైతుల ఖాతాల్లోకి నేరుగా వెళ్లే పెట్టుబడి సాయాన్ని ఇప్పుడు అడ్డుకోవడం దారుణమని విమర్శించారు. అలాగే మహిళా ఓటర్లను ఆకర్షించడానికి ప్రకటించిన మహాలక్ష్మి పథకం (నెలకు రూ. 2,500) అమలు ఊసే లేదని, ఆ హామీ అటకెక్కిందని ఆయన ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన “420 హామీలు” కేవలం ఎన్నికల గిమ్మిక్కులేనని ప్రజలకు అర్థమైందని కేటీఆర్ పేర్కొన్నారు.
Nara lokesh news : ఢిల్లీలో లోకేశ్ మిషన్, కేంద్రంతో కీలక నిధుల చర్చలు!
రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, అభివృద్ధి కంటే రాజకీయ కక్షసాధింపులకే ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. నిరుద్యోగులు, రైతులు, మహిళలు అందరినీ వంచించిన ఈ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మొదలైందని కేటీఆర్ విశ్లేషించారు. హామీల అమలు కోసం తాము ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధమవుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు. కేటీఆర్ చేసిన ఈ ఘాటు విమర్శలు ఇప్పుడు అటు సోషల్ మీడియాలోనూ, ఇటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే తగిన గుణపాఠం తప్పదని ఆయన హెచ్చరించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com