మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్ స్టేషన్ (Bachupalli Police Station) పరిధిలో దారుణ ఘటన వెలుగు చూసింది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీలోని నిర్మానుష్య ప్రాంతంలో ఒక పెద్ద ట్రావెల్ బ్యాగ్లో గుర్తు తెలియని మహిళ మృతదేహం (The dead body of a woman) కనిపించడం కలకలం రేపింది. బ్యాగ్ చుట్టుపక్కల దుర్వాసన రావడంతో అక్కడి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు బ్యాగ్ను పరిశీలించగా అందులో మహిళ మృతదేహం ఉండటం చూసారు.
హత్యచేసి బ్యాగ్లో పడేసినట్లు అనుమానం
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలికి వయస్సు సుమారు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండే అవకాశముందని భావిస్తున్నారు. ఆమె మెరూన్ కలర్ పంజాబీ డ్రెస్సు ధరించి ఉండగా, దారుణంగా హత్యచేసి బ్యాగ్లో పడేసినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతురాలి గుర్తింపు కోసం ప్రత్యేక బృందాలు పని చేస్తున్నాయి.
డీసీపీ సురేశ్ కుమార్ ఆధ్వర్యంలో పరివేక్షణ
బాలానగర్ జోన్ డీసీపీ సురేశ్ కుమార్ ఈ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మృతురాలి ఆచూకీ తెలుసుకోవడంతో పాటు హత్య జరిగిన కారణాలపై క్లారిటీ కోసం సీసీ కెమెరా ఫుటేజీలు, స్థానికుల స్టేట్మెంట్లు ఆధారంగా విచారణ కొనసాగుతోంది. ఈ ఘటన వెనుక ఉన్న ముఠా, సంబంధిత నేరగాళ్లపై త్వరలోనే స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. ఈ మిస్టరీ హత్య కేసు స్థానికంగా భయాందోళనలకు కారణమవుతోంది.
Read Also : Botsa Satyanarayana: వైసీపీ బొత్స సత్యనారాయణ తాజా హెల్త్ బులెటిన్