Gadwal sand news : ఇసుక రవాణా నిలిపివేత స్థానిక నాయకుల దౌర్జన్యం కారణంగా ప్రజల అవస్థలు

Read Time:  1 min
Gadwal sand news
Gadwal sand news
FONT SIZE
GET APP

ఇసుక కమీషన్‌ల కోసం ప్రజలను ఇబ్బంది పెడుతున్న నాయకులు – తుమ్మిళ్లలో మూడు రోజులుగా ఇసుక సరఫరా నిలిచిపోయింది

Gadwal sand news : జోగుళాంబ గద్వాల జిల్లా, అక్టోబర్ 13 “మా నాయకుడి అనుమతి లేకుండా ఇక్కడ చీమ కూడా కదలదు!” తుమ్మిళ్ల రీచ్ వద్ద ఈ మాటలే ఇప్పుడు మార్మోగుతున్నాయి. (Gadwal sand news) అధికార పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి అనుచరులు ఇసుక రవాణా టెండర్‌దారులను భయభ్రాంతులకు గురి చేస్తూ, ఇసుక సరఫరాను అడ్డుకుంటున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇసుక తరలిస్తే మీ అంతు చూస్తాం!

తుమ్మిళ్ల ఇసుక రీచ్ నుండి అనుమతి లేకుండా ఎవరు ఇసుక తరలించినా వాహనాలను అడ్డుకుంటామంటూ హెచ్చరికలు జారీ చేశారు. “మా నాయకుడితో మాట్లాడి, అనుమతి తీసుకున్న తర్వాతే టిప్పర్లు నడపాలి” అని బెదిరింపులు మొదలయ్యాయి. ఫలితంగా, గత మూడు రోజులుగా రీచ్ వద్ద సుమారు 20 టిప్పర్లు నిలిచిపోయాయి.

అధికారుల మౌనం – కాంట్రాక్టర్‌కు ఇబ్బంది

టీఎండీసీ, ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా చేయడానికి రాజమండ్రి కాంట్రాక్టర్‌కు టెండర్‌ లభించింది. కానీ ఆ టెండర్‌ స్థానిక నాయకుడి అనుచరులకు రుచించలేదు. ఎందుకంటే అంతకుముందు ఇసుక వ్యాపారం మొత్తం ఆ నేత కనుసన్నల్లోనే నడిచేది. ఇప్పుడు టెండర్‌ ఇతరుల చేతికి వెళ్లడంతో లాభాలు కోల్పోయారనే ఆగ్రహంతో ఆయన అనుచరులు వాహనాలను అడ్డుకుంటున్నారని సమాచారం.

కాంట్రాక్టర్‌ ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులకు తెలిపినా, వారు స్పందించకపోవడంతో ఇసుక రవాణా పూర్తిగా నిలిచిపోయింది. అధికారులు కూడా స్థానిక నేతలకు సహకరిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Suresh Gopi: నా ఆదాయం ఆగిపోయింది.. మళ్ళీ సినిమాల్లో నటిస్తా: మంత్రి సురేశ్ 

ఇసుక దొరకక గృహనిర్మాణదారుల అవస్థలు

ఇసుక రవాణా నిలిచిపోవడంతో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు, గృహనిర్మాణదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం “ఇసుక కొరత రాదు” అని చెబుతూనే, అధికార పార్టీ నేతలే సరఫరాను అడ్డుకోవడం ప్రజలను మోసం చేయడమేనని లబ్ధిదారులు మండిపడుతున్నారు.

కమీషన్ కోసమే ఈ డ్రామా

“తెలంగాణ సీఎం, గృహనిర్మాణ శాఖ మంత్రి ఫోటోలు పెట్టుకుని ప్రభుత్వ ఇసుక టిప్పర్లను అడ్డుకోవడం విడ్డూరం. ఉచితంగా ఇస్తున్నాం అంటూ కమీషన్‌లు కాజేస్తున్నారు. ఇదంతా పైస్థాయి నేతల మద్దతుతోనే జరుగుతోంది,” అని స్థానికుడు అడివప్ప (తుమ్మిళ్ల) ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రజల అభిప్రాయం

“అన్ని అనుమతులతో వెళ్తున్న టిప్పర్లను ఎందుకు అడ్డుకుంటున్నారు? అధికార పార్టీ నాయకులు ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నారు. అధికారులు వెంటనే జోక్యం చేసుకుని ఇసుక సరఫరా పునరుద్ధరించాలి,” అని తుమ్మిళ్ల మాజీ సర్పంచ్‌ గజేంద్ర డిమాండ్ చేశారు.

Read hindi news: hindi.vaartha.com

Epaper : https://epaper.vaartha.com/

Read also :

Sai Kiran

రచయిత గురించి

Sai Kiran

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.