హైదరాబాద్ : బంగాళా ఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ పాటు, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తెల్లవారు జాము నుండి వర్షాలు కురుస్తున్నాయి.
పిడుగుపాటు కారణంగా ఆదిలాబాద్ జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఆరుగురు వ్యవసాయ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ జిల్లాలోని గాదిగూడ మండలం పిప్పిరిలో నలుగురు మృతి చెందారు. పొలాల్లో పనులు చేసుకుంటున్న సమయం ఒక్కసారిగా వర్షం పడటంతో చెట్లకిందకి చేరారు. ఈ క్రమంలో చెట్టుపై పిడుగు పడడంతో ముగ్గురు మహిళలు, ఓ వ్యక్తి అక్కడికక్కడే చనిపోయారు. అలాగే ఇదే జిల్లాలోని బేల మండలంలో వ్యవసాయ పనులకు వెళ్లిన మహిళలు వర్షంలో పనిచేస్తుండగా ఒక్కసారిగా పిడుగులు పడడంతో ఇద్దరు మృతి చెందారు. ఇక రాష్ట్రంలోని సిద్దిపేట్, కామారెడ్డి, నిజామాబాద్, మంచిర్యాల, మహబూబ్నగర్, హైదరాబాద్ తదితర జిల్లాల్లో కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. పాఠశాలలు పున:ప్రారంభం కావడంతో విద్యార్థులు సైతం తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని శంకర్పల్లిలో వర్షపు నీటితో బస్టాండ్లో వర్షపు నీరు నిలవడంతో ఇవాళ ఉదయం ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
164.6 ఎంఎం వర్ష పాతం నమోదు
కొల్లాపూర్ డివిజన్లో రాత్రి భారీ వర్షం కురిసింది. 164.6 ఎంఎం వర్ష పాతం నమోదు అయింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో భారీ వర్షం కురిసింది. శేరిలింగంపల్లి రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద భారీగా వరద నీరు చేరడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రాంతంలో కేవలం గంట సేపట్లో 114.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. భారీ వర్షం నేపథ్యంలో మజీద్ బండ, డోయెన్స్ కాలనీ ప్రాంతాల నుండి గచ్చిబౌలి, కొండాపూర్ వైపు వెళ్లే దారులు నీట మునిగాయి. ఆ ప్రాంతాల గుండా వెళ్లేవారు మరోదారిలో వెళ్లాలని సైబరాబాద్ పోలీసులు ప్రయాణికులకు సూచించారు. హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. సరూర్ నగర్, చైతన్యపురి, కొత్తపేట, దిల్సుఖ్నగర్, మూసారాంబాగ్, చాదరాఘాట్, మలక్పేట్, సంతోష్ నగర్, సైదాబాద్, కర్మన్ ఘాట్, చంపాపేట ప్రాంతాల్లో ఈ ఉదయం వర్షం కురిసింది. దీంతో ఉదయం పూట బయటకు వెళ్లిన వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. అలాగే పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో విద్యార్థులు ఇక్కట్లకు గురయ్యారు. రోడ్లపై నీరు ప్రవహించడంతో చెరువులను తలపించాయి.
ఇప్పటికే నగరంలో జీహెచ్ఎంసీ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాష్ట్రంలో అత్యధికంగా సిద్దిపేట్ జిల్లా దూలమెట్ట, కామారెడ్డి జిల్లా బికనూర్ ప్రాంతాల్లో 51.5 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయింది. నిజామాబాద్ జిల్లా మదనపల్లెలో 25.3 మిల్లీ మీటర్లు, మంచిర్యాల జిల్లా లింగాపూర్, నిజామబాద్ జిల్లా చందూర్లో 24.8 మిల్లీ మీటర్ల వర్షపాతం రికార్డయింది.
దిగ్భ్రాంతి వ్యక్తం వ్యకం చేసిన మంత్రి సీతక్క
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పిడుగుపాటుకు ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం పట్ల జిల్లా ఇంచార్జ్ మంత్రి సీతక్క తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఘటన జరిగిన వెంటనే సంబంధిత కలెక్టర్లతో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అన్నివిధాలుగా అండగా నిలుస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అప్రమత్తంగా, జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు
Read also: Thummalanageswar Rao: మంత్రి తుమ్మలను విచారించనున్న జస్టిస్ పిసి ఘోష్?