తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Revenue Minister Ponguleti Srinivas Reddy) గత బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS Govt)పై తీవ్ర విమర్శలు చేశారు. గత పాలనలో రెవెన్యూ వ్యవస్థ పూర్తిగా భ్రష్టుపట్టిందని, అవినీతితో నిండిపోయిన విధానాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. ఈ పరిస్థితిని మార్చడం, పారదర్శకమైన పాలన అందించడమే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రెవెన్యూలో మౌలిక సంస్కరణలకు శ్రీకారం చుట్టినట్లు చెప్పారు.
భూ భారతి చట్టంతో భూముల సమస్యలకు పరిష్కారం
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన “భూ భారతి” చట్టాన్ని దశలవారీగా అమలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ చట్టం అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు విడతలుగా రెవెన్యూ సదస్సులు నిర్వహించామని వివరించారు. ఏప్రిల్ 17 నుంచి జూన్ 20 వరకూ 593 మండలాల్లో మొత్తం 10,725 రెవెన్యూ సదస్సులు నిర్వహించామని తెలిపారు. ప్రజల నుంచి 8.58 లక్షల దరఖాస్తులు వచ్చాయని వెల్లడించారు.
పారదర్శక దరఖాస్తు ప్రక్రియ – ప్రజల స్పందన
ప్రతి గ్రామంలో ఉచితంగా దరఖాస్తు ఫారాల పంపిణీ, ఎలాంటి రుసుములు లేకుండా ఎమ్మార్వోలు ఆధ్వర్యంలో దరఖాస్తుల స్వీకరణ వంటి చర్యలు ప్రజలకి విశ్వాసాన్ని కలిగించాయని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు 3.27 లక్షల దరఖాస్తులను ఆన్లైన్లో నమోదు చేశామని, మిగిలిన దరఖాస్తులనూ త్వరగా అప్లోడ్ చేయాలని అధికారులను ఆదేశించామని చెప్పారు. రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా పునర్నిర్మించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల సహకారంతో ఇది సాధ్యమవుతుందని మంత్రి పొంగులేటి తెలిపారు.
Read Also : Helmet Rule : రెండు హెల్మెట్లు తప్పనిసరి : త్వరలో కొత్త రూల్?