తెలంగాణ(Telangana)లో సన్న వడ్ల కొనుగోలు పూర్తయినప్పటికీ రైతులకు బోనస్ (Bonus ) ఇవ్వకుండా ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీశ్ రావు (Harishrao) తీవ్రంగా మండిపడ్డారు. యాసంగి సీజన్కు సంబంధించిన సన్న వడ్ల బోనస్ కింద రూ.1,161 కోట్లను ఇప్పటికీ రైతులకు ఇవ్వకపోవడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. రైతులకు ఇచ్చే హామీలు మరిచిపోయి ప్రభుత్వ బాధ్యతల్ని నిర్లక్ష్యం చేస్తున్నారని తీవ్రంగా వ్యాఖ్యానించారు.
సన్ఫ్లవర్ రైతుల నిరీక్షణ ముగిసేదెప్పుడు?
హరీశ్ రావు ప్రకారం, సన్ఫ్లవర్ పంటను కొనుగోలు చేసిన 75 రోజులు పూర్తైనప్పటికీ, రైతులకు డబ్బులు జమ కాలేదని చెప్పారు. రైతులు ఎన్నో ఆశలతో పంటలు సాగు చేస్తుంటే ప్రభుత్వం స్పందించకపోవడం తీవ్రంగా బాధాకరమన్నారు. వెంటనే నగదు విడుదల చేసి రైతులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పంటలు అమ్మినా డబ్బులు రాక వ్యవసాయదారులపై ఆర్థిక భారం పెరుగుతోందని హెచ్చరించారు.
వానాకాలం రైతు భరోసా కూడా అడుగంటిందా?
గత వానాకాలం రైతు భరోసా నిధుల విషయాన్ని ప్రస్తావించిన హరీశ్ రావు, ప్రభుత్వం మరిచిపోవడం బాధాకరమన్నారు. యాసంగిలో సగం మందికీ రైతు భరోసా అందలేదని పేర్కొన్నారు. ఇది నేరుగా రైతులపై బరువు వేయడమేనని, ప్రభుత్వం మాట తప్పకుండా తక్షణమే బకాయిలను చెల్లించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. రైతులపై ప్రభుత్వం చూపే ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రజలు గమనిస్తున్నారని ఆయన హెచ్చరించారు.