తెలంగాణ (TG) లో ప్రైవేట్ పాఠశాలల్లో ఫీజుల నియంత్రణ దిశగా ప్రభుత్వం కీలకమైన అడుగులు వేస్తోంది. సామాన్య, మధ్యతరగతి తల్లిదండ్రులపై పెరుగుతున్న ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఫీజుల పెంపుపై స్పష్టమైన నియంత్రణ విధానాన్ని అమలు చేయడానికి సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా రెండేళ్లకు ఒకసారి కేవలం 8 శాతం వరకు మాత్రమే ట్యూషన్ ఫీజు పెంచుకునేలా నిబంధనలు ఖరారు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావడానికి అవసరమైన కసరత్తు జరుగుతోంది.ఈ అంశంపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుల మేరకు విద్యా కమిషన్ “తెలంగాణ ప్రైవేట్ అన్ఎయిడెడ్ స్కూల్ రెగ్యులేటరీ అండ్ మానిటరింగ్ కమిషన్ ముసాయిదా బిల్లు-2025″ను సిద్ధం చేసింది.
Read Also: Telangana: పాలేరు నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన
ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు భేటీ
పురపాలక ఎన్నికల తర్వాత జరిగే కేబినెట్ సమావేశంలో ఈ బిల్లును ఆమోదించి చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. నిబంధనల ప్రకారం, 8 శాతం కంటే ఎక్కువ ఫీజు పెంచాలనుకుంటే, ప్రభుత్వం ఏర్పాటు చేసే రాష్ట్రస్థాయి కమిషన్ నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి.అయితే, ప్రభుత్వ ప్రతిపాదనను ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఏటా ద్రవ్యోల్బణం 5-6 శాతం పెరుగుతోందని, టీచర్ల జీతాలు, భవనాల అద్దెలు ఏటా పెరుగుతున్నాయని, ఇలాంటి పరిస్థితుల్లో రెండేళ్లకు ఒకసారి 8 శాతం పెంపు ఏమాత్రం గిట్టుబాటు కాదని స్పష్టం చేస్తున్నాయి.
ఉన్నత విద్యా సంస్థల మాదిరిగా పాఠశాలల్లో యాజమాన్య కోటా వంటి అదనపు ఆదాయ మార్గాలు ఉండవని వారు గుర్తు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లుగా ఏటా ఫీజులు పెంచుకునే అవకాశం కల్పించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘంతో ప్రైవేట్ పాఠశాలల ప్రతినిధులు భేటీ కానున్నారు. అటు తల్లిదండ్రులకు ఉపశమనం, ఇటు విద్యాసంస్థల మనుగడ మధ్య ప్రభుత్వం ఎలాంటి మధ్యేమార్గం కనుగొంటుందనేది ఆసక్తికరంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: