TG Legislative Council: 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కాగా.. మంగళవారం గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ఉభయ సభల్లోనూ మొదటిరోజు చర్చ కొనసాగింది. సమావేశాలు ప్రారంభం కాగానే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చించనున్నట్టు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. తీర్మానం ప్రవేశ పెట్టాలని కోరగా టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ బి మహేష్ కుమార్ గౌడ్ గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశ పెట్టారు. మరో కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ తీర్మానాన్ని బలవరుస్తున్నట్టు తెలిపారు.
Read Also: TG Council budget sessions: అభివృద్ధి, సంక్షేమం లక్ష్యంగా పాలన

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. చట్టసభలను బిఆర్ఎస్ నేతలు రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం టిఆర్ఎస్ ఉద్యమించిన పార్టీ అధికారం వచ్చాక బిఆర్ఎస్ గా రూపాంతరం చెందిందన్నారు. తెలంగాణ అస్థిత్వాన్ని పార్టీ నుంచి తొలగించారన్నారు. 1200 మంది అమరులైతే.. వారిలో కేవలం 500 మంది కుటుంబాలకు మాత్రమే సాయం అందించారని అన్నారు. నిజాన్ని అబద్ధం చేయడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప… వాస్తవాలను ఒప్పుకోవడానికి బిఆర్ఎస్ నేతలు సిద్ధంగా లేరన్నారు. బిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రంలో ఆర్ధిక విధ్వంసం చేసిందని మండిపడ్డారు.
గ్యారంటీల అమలుపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విపక్షాలు
మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ.. మొదటగా రాష్ట్ర ప్రభుత్వానికి, చైర్మన్ కి ధన్యవాదాలు తెలిపారు. కొత్త భవనంలో శాసనమండలి సమావేశాలు నిర్వహించడానికి కృషి చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్టు చెప్పారు. గవర్నర్ ప్రసంగం ఊహా లోకంలోకి తీసుకెళ్లిందని విమర్శించారు. వాస్తవాలను కాదని ప్రజలను ఊహాలోకంలోకి తీసుకెళ్లేలాగా గవర్నర్ ప్రసంగం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలను ఎందుకు చట్టబద్ధత చేయడం లేదని ప్రశ్నించారు.. ప్రభుత్వం చేపట్టిన బీసీ కులగణనలో లోపాలు జరిగాయని, వాటిని సరిచేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రైతు భరోసాలో రూ. 23 వేల కోట్ల బకాయిలను ఇవ్వాల్సి ఉండన్నారు. కాంగ్రెస్ ఇచ్చినటువంటి హామీలను ప్రపంచంలో ఏ దేశంలో ఏ పార్టీ ఇవ్వలేదన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఏ వర్గం కూడా సంతోషంగా లేదన్నారు.
విద్యా రంగం, రుణమాఫీపై చర్చ
బిజేపీ వక్ష నాయకుడు ఏవిఎన్ రెడ్డి మాట్లాడుతూ… రాష్ట్రంలో జాతీయ విద్యా విధానం-2020ని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. ఎన్డీపీ అమలుకు ప్రభుత్వం ఎందుకు వెనకడుగు వేస్తుందన్నారు. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు లేవని దీంతో విద్యార్థుల సంఖ్య ప్రతి ఏడాది తగ్గుతూ వస్తోందన్నారు. సిసిఐ ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం మాట్లాడుతూ.. రాష్ట్రంలోని రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2 లక్షల వరకు ఉన్న రైతు రుణాలను రుణమాఫీ చేసిందని.. కానీ రూ. 2 లక్షల కంటే ఒక్క వెయ్యి ఎక్కువ ఉన్నప్పటికీ వాటి రుణమాఫీ చేయలేదన్నారు. దీనిని వరిశీలించి వారికి రుణమాఫీ చేసేలా చూడాలన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ పాలనపట్ల కొంత అసంతృప్తి ఉన్నమాట వాస్తవమని.. దానిని ప్రజా ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. ఎన్నికలకు ముందు ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు కావస్తోందని వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియను ప్రారంభించాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: