తెలంగాణ (Telangana) లో ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య మరింత ముదురుతోంది. రాష్ట్రంలోని వేలాది విద్యాసంస్థలు, లక్షలాది మంది విద్యార్థులు సంక్షోభంలో చిక్కుకున్న నేపథ్యంలో, బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao) కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఆయన విమర్శిస్తూ— “రెండేళ్లుగా బకాయిలు పేరుకుపోయినా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోకపోవడం దారుణం. బంద్ పిలుపునిచ్చినా చలనం కనబరచకపోవడం విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడటమే” అని అన్నారు.
నిర్లక్ష్యం కాకపోతే మరేమిటి?
హరీశ్ రావు మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల విడుదల లోపంతో డిగ్రీ, పీజీ, ఫార్మసీ, ఇంజినీరింగ్, వృత్తి విద్యా కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొన్నదని ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 13 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. “సెమిస్టర్ పరీక్షలు వాయిదా పడుతున్నా, ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి ఈ అంశాన్ని పట్టించుకోవడం లేదు. ఇది విద్యార్థులపై నిర్లక్ష్యం కాకపోతే మరేమిటి?” అని ఆయన ప్రశ్నించారు.
ప్రస్తుత ప్రభుత్వ ప్రాధాన్యతలను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ఉద్యోగులకు జీతాలు, విద్యార్థులకు ఫీజులు ఇవ్వలేమని చెబుతున్న ప్రభుత్వం, లక్షల కోట్ల రూపాయల టెండర్లు మాత్రం ఎందుకు పిలుస్తోందని నిలదీశారు. “మూసీ సుందరీకరణకు లక్షన్నర కోట్లు, ఫ్యూచర్ సిటీకి 20 వేల కోట్లు, ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు 25 వేల కోట్ల టెండర్లు పిలుస్తున్నారు. రెండున్నర లక్షల కోట్ల టెండర్లపై ఆసక్తి చూపుతున్న ప్రభుత్వం, విద్యార్థుల భవిష్యత్తుపై మాత్రం నిర్లక్ష్యం చేస్తోంది” అని ఆయన వ్యాఖ్యానించారు.
Harish Rao
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే
గత బీఆర్ఎస్ (BRS) పాలనను ప్రస్తుత పరిస్థితులతో పోలుస్తూ, తమ కాలంలో నోట్ల రద్దు, కరోనా వంటి ఆర్థిక సంక్షోభాల సమయంలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ నిలిపిపెట్టలేదని గుర్తుచేశారు. తొమ్మిదిన్నరేళ్ల పాలనలో రూ. 20 వేల కోట్లకు పైగా బకాయిలు చెల్లించామని తెలిపారు. “కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఈ పథకం దారుణ స్థితికి చేరింది. అసెంబ్లీలో హామీ ఇచ్చి కూడా మాట తప్పారు” అని హరీశ్ అన్నారు.
విద్యాసంస్థల యాజమాన్యాల పరిస్థితి కూడా విషమంగా మారిందని ఆయన వివరించారు. అద్దెలు, విద్యుత్ బిల్లులు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేని స్థితి ఏర్పడిందని తెలిపారు. మరోవైపు, ఫీజులు రాకపోవడంతో కళాశాలలు విద్యార్థుల సర్టిఫికెట్లు ఇవ్వకుండా నిలిపివేస్తున్నాయని, దీంతో వారు కోర్టుల వరకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తోందని హరీశ్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
అంతేకాక, “ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని సీఎం చెప్పిన మాటలు అబద్ధమని, యూడైస్ రిపోర్టు ప్రకారం ఈ ఏడాది 47 వేల మంది విద్యార్థులు తగ్గారు” అని ఆరోపించారు. గ్రీన్ ఛానెల్ ద్వారా నిధులు విడుదల చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ఏమైందని రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు.
చివరగా హరీశ్ రావు (Harish Rao) హెచ్చరిస్తూ, “ప్రభుత్వం వెంటనే కళ్లు తెరిచి, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలి. లేనిపక్షంలో, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున పోరాటానికి సిద్ధమవుతాం” అని స్పష్టం చేశారు.
హరీశ్ రావు ప్రభుత్వంపై ఏ ఆరోపణలు చేశారు?
A: రెండేళ్లుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు, విద్యాసంస్థలు తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆరోపించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ సమస్య ఎవరిని ప్రభావితం చేస్తోంది?
A: దాదాపు 13 లక్షల ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థులు, రాష్ట్రంలోని వందలాది కళాశాలలు ఈ సమస్యతో నష్టపోతున్నాయి.
Read hindi news: epaper.vaartha.com
Read Also: