తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి పెట్టుబడులు కీలకమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) ఢిల్లీలో జరిగిన పబ్లిక్ ఎఫైర్స్ ఫోరమ్ ఆఫ్ ఇండియా సదస్సులో స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ధి దిశగా ప్రభుత్వం ఇప్పటికే పలు వ్యూహాత్మక ప్రణాళికలు సిద్ధం చేసిందని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా డిసెంబర్లో “తెలంగాణ రైజింగ్ విజన్ 2047” అనే డాక్యుమెంట్ను విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. ఈ డాక్యుమెంట్ ద్వారా రాబోయే 20 సంవత్సరాల అభివృద్ధి దిశను ప్రభుత్వం ముందుకు తీసుకెళ్లనుందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ మాట్లాడుతూ రాబోయే ఐదేళ్లలో హైదరాబాద్ మెట్రో (HYD Metro) ప్రయాణికుల సంఖ్యను భారీ స్థాయిలో పెంచే ప్రయత్నం జరుగుతుందని వివరించారు. ప్రస్తుతం లక్షల మంది మెట్రోలో ప్రయాణిస్తున్నప్పటికీ, భవిష్యత్తులో 15 లక్షల మంది రోజూ మెట్రో సౌకర్యాన్ని వినియోగించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలిపారు. నగర రవాణా సదుపాయాలను విస్తరించడమే కాకుండా, ఆధునికతతో కూడిన రవాణా వ్యవస్థను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజల జీవితాన్ని సులభతరం చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు.
ఇకపోతే, హైదరాబాద్ అభివృద్ధి ప్రణాళికలో భాగంగా మూసీ నదిని సుందరీకరించడం కోసం భారీ ప్రాజెక్టులు చేపడుతున్నామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నగరంలోని పాత బస్సులను గ్రామాలకు తరలించి, హైదరాబాద్లో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించామని తెలిపారు. దీని ద్వారా నగర కాలుష్యం తగ్గిపోవడంతో పాటు, పచ్చదనం పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఈ చర్యలు కేవలం రవాణా సౌకర్యాలకే పరిమితం కాకుండా, పర్యావరణ పరిరక్షణలోనూ కీలకపాత్ర పోషిస్తాయని ఆయన పేర్కొన్నారు.