తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రాష్ట్రంలో విద్యా రంగాన్ని మెరుగుపరచేందుకు మరో కీలక అడుగు వేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించేందుకు ప్రతి మండలంలో మూడు తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను (From Nursery to Intermediate) ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ సిఫార్సు చేసింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ విద్యార్థులకు ప్రైవేట్ స్థాయిలో అధునాతన వసతులు, నాణ్యమైన బోధనను అందించేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంత విద్యార్ధులకు మెరుగైన విద్య అవకాశాలు లభించనున్నాయి.
పైలట్ ప్రాజెక్ట్గా ఈ జిల్లాలో ఏర్పాటు
ఈ ఏడాది పైలట్ ప్రాజెక్ట్గా రంగారెడ్డి జిల్లాలో మంచాల, ఆరుట్ల, నాగర్ కర్నూల్ జిల్లాలో వంగూరు, పొల్కంపల్లి ప్రాంతాల్లో తొలి నాటి తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. ఒక్కో పాఠశాల ఏర్పాటుకు రూ.12 కోట్ల వ్యయం కేటాయించనుండగా, ఒక్కో స్కూల్లో 1,500 నుండి 1,800 మంది విద్యార్థులకు అడ్మిషన్ అవకాశం కలగనుంది. ఆధునిక తరగతి గదులు, ల్యాబ్లు, లైబ్రరీలు, డిజిటల్ టెక్నాలజీ వనరులతో ఈ స్కూల్లు సజ్జంగా ఉండనున్నాయి.
ప్రైవేట్ విద్యా సంస్థలతో పోటీపడగల సామర్థ్యం
తెలంగాణ పబ్లిక్ స్కూల్ పథకం ద్వారా రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యార్ధులకు ప్రైవేట్ విద్యా సంస్థలతో పోటీపడగల సామర్థ్యం కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. ఈ స్కూళ్లను స్థాపించడం ద్వారా తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలలపై ఆధారపడాల్సిన అవసరం లేకుండా పోవచ్చు. ఇది విద్యా రంగంలో ఒక నూతన అధ్యాయాన్ని ప్రారంభించనుంది. పైలట్ ప్రాజెక్టు విజయవంతమైతే రాష్ట్రవ్యాప్తంగా అమలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
Read Also : BRS : గత బిఆర్ఎస్ సర్కార్ పై భట్టి విక్రమార్క ఆరోపణలు