తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు (Panchayat Elections) త్వరలో జరగనున్నాయని ప్రభుత్వ వర్గాల్లో చర్చ సాగుతోంది. అందుబాటులో ఉన్న సమాచారం మేరకు జూన్ చివరి వారం లేదా జూలై మొదటి వారం లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం యోచన చేస్తోంది. ఇప్పటికే పంచాయతీలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు క్లియర్ చేయడంతో పాటు ప్రభుత్వ పథకాలను వేగంగా అమలు చేస్తుండటం ఈ ఎన్నికల సన్నాహాలను బలపరిచే అంశాలుగా కనిపిస్తున్నాయి.
ఎన్నికల ఫలితాలపై ప్రభావం
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లకు ప్రభుత్వ పరిపాలనపై నేరుగా అభిప్రాయ ప్రకటించే అవకాశం లభించనుంది. గ్రామస్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు, పథకాల అమలులో అధికారుల పనితీరు, స్థానిక నాయకత్వం సారధ్యం వంటి అంశాలు ప్రధానంగా ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే రంగంలోకి దిగి ఎన్నికల సన్నాహాలు ప్రారంభించినట్లు సమాచారం.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
అయితే ఈ మధ్య బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లు ఇంకా పెండింగ్లో ఉండటంతో, ఆ అంశంపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రిజర్వేషన్ల ప్రక్రియపై స్పష్టత లేకపోతే ఎన్నికల షెడ్యూల్పై అస్పష్టత ఉండే అవకాశముంది. ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ సన్నద్ధమవుతుండటంతో, అధికారిక ప్రకటన కోసం ఉత్కంఠ నెలకొంది.
Read Also : CM Revanth : నేడు సంగారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన