Telangana municipal elections : తెలంగాణలో ఉత్కంఠభరితంగా సాగిన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ముగిసింది. రాష్ట్రంలోని 7 నగర కార్పొరేషన్లు, 116 మున్సిపాలిటీల పరిధిలో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పోలింగ్ ముగిసే సమయానికి క్యూలో ఉన్న ఓటర్లందరికీ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. కొన్ని చోట్ల స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నప్పటికీ, మొత్తంగా ఎన్నికలు ప్రశాంతంగా పూర్తయ్యాయి.
కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 58వ డివిజన్లో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డట్లు సమాచారం. కేంద్ర మంత్రి బండి సంజయ్ వ్యక్తిగత ఫొటోగ్రాఫర్కు కూడా గాయాలైనట్లు తెలుస్తోంది. ఈ ఘటనకు నిరసనగా బీజేపీ నేతలు జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు.
Read Also: Manipur Violence: మణిపుర్లో మరోసారి అల్లర్లు
అదేవిధంగా కరీంనగర్లోని మరో డివిజన్లో దొంగ ఓట్ల వ్యవహారం బయటపడింది. ఓ పోలింగ్ కేంద్రంలో నకిలీ ఆధార్ కార్డులతో ఓటు వేయడానికి వచ్చిన ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై ఎంఐఎం అభ్యర్థి ఆ బూత్లో రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 2,569 మున్సిపల్ వార్డులు, 412 కార్పొరేషన్ డివిజన్లలో అభ్యర్థుల భవితవ్యం బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైంది. ఈ నెల 13వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 136 కౌంటింగ్ కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. అదే రోజు మధ్యాహ్నానికల్లా ఫలితాలపై స్పష్టత రానుంది. అనంతరం 16వ తేదీన మేయర్లు, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాల కోసం రాజకీయ పార్టీలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: